మంత్రి అచ్చెన్నాయుడు జోక్యంతో వెనక్కి తగ్గిన ఫీడ్ తయారీ సంస్థలు..
మంత్రి ఆదేశాలను గౌరవిస్తూ ధరల పెంపును నిలిపివేసిన అసోసియేషన్..
అమరావతి: రాష్ట్రంలోని ఆక్వా రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రొయ్యల ఫీడ్ ధరలను ఒక్కసారిగా పెంచడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ష్రిమ్ప్ ఫీడ్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ఆక్వా రైతులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు.
ఫీడ్ ధరలను ఆకస్మికంగా పెంచడం వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులపై తీవ్ర భారం పడుతుందని రైతులు సమావేశంలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, మార్కెట్ పరిస్థితుల మధ్య ఈ ధరల పెంపు రైతులకు మరింత నష్టం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టంగా స్పందించారు. రైతులకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు ఏవీ ఏకపక్షంగా తీసుకోరాదని ఆయన హెచ్చరించారు. పెంచిన ఫీడ్ ధరల అమలును తక్షణమే నిలిపివేయాలని అసోసియేషన్ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సూచనలను గౌరవిస్తూ ఫీడ్ తయారీ సంస్థల అసోసియేషన్ ధరల పెంపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆక్వా రైతుల్లో కొంత ఊరట నెలకొంది.
రైతుల ప్రయోజనాల పరిరక్షణే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఆక్వా రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోందని, ఈ రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇక శుక్రవారం మరోసారి రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, అధికారులతో ఉమ్మడి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. అందరి అభిప్రాయాలు, సమస్యలు, సూచనలు పరిగణలోకి తీసుకుని తీసుకునే నిర్ణయాన్నే అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఆక్వా రంగం అభివృద్ధికి అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.