ఢిల్లీలో వినిపించిన ఉత్తరాంధ్ర గళం…
అన్నే నా మార్గదర్శి….
శ్రీకాకుళం అభివృద్ధికి బాటలు….
ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అచ్చెన్నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు.
నివాళులర్పించిన అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రన్నాయుడు వంటి గొప్ప నాయకుడికి తమ్ముడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. నా రాజకీయ ప్రస్థానానికి నా జీవితానికి ఆయనే దిక్సూచి. క్రమశిక్షణతో కూడిన రాజకీయం ఎలా చేయాలో ఆయనను చూసే నేర్చుకున్నాను, అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. కేవలం కుటుంబానికే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి ఎర్రన్నాయుడు అని ఆయన కొనియాడారు.
ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడు తనకు అత్యంత ఆప్తుడని, చివరి శ్వాస వరకు ప్రజా సేవలోనే గడిపిన ఆయన స్ఫూర్తి అందరికీ ఆదర్శమని చంద్రబాబు కొనియాడారు. మరోవైపు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎర్రన్నాయుడు చేసిన కృషి చిరస్మరణీయమని, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని లోకేష్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకు ఎర్రన్నాయుడు గారు పడిన తపనను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు గుర్తు చేసుకున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాలకు రోడ్లు వేయించడం, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిదని వారు అన్నారు. ముఖ్యంగా జిల్లాలో విద్య, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఆయన విశేష కృషి చేశారని, ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే నాయకుడు ఆయనేనని కొనియాడారు.
ఎర్రన్నాయుడు కేవలం ఒక ప్రాంతీయ నేతగానే కాకుండా కేంద్ర మంత్రిగా దేశ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఉత్తరాంధ్ర హక్కుల కోసం ఢిల్లీ వేదికగా ఆయన గళం విప్పేవారని, ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు సాధించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారని నేతలు గుర్తు చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని, ప్రజా సేవలో భాగస్వాములు కావాలని ఆయన నిరంతరం స్ఫూర్తినిచ్చేవారని పేర్కొన్నారు.