- "భారత ఇంధన భద్రత పటిష్టం": ముడి చమురు సరఫరాపై ఆందోళన అవసరం లేదన్న మంత్రిత్వ శాఖ..
- Gulf: "చెల్లింపు సమస్యలు లేవు.. అంతా సాధారణమే": ఇరాన్ చమురు దిగుమతులపై ప్రభుత్వం క్లారిటీ..
Iran Oil Imports: భారత్కు రావాల్సిన ఇరాన్ ముడి చమురు నౌక చెల్లింపుల సమస్యల కారణంగా చైనాకు మళ్లిందంటూ సోషల్ మీడియా మరియు కొన్ని ప్రధాన వార్తా సంస్థల్లో వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం శనివారం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న 'పింగ్ షున్' అనే ఇరాన్ నౌక గుజరాత్లోని వాడినార్కు రావాల్సి ఉండగా, అది చైనాలోని డాంగింగ్కు వెళ్లినట్లు షిప్ ట్రాకింగ్ డేటాలో కనిపించడంతో మొదలైన ఊహాగానాలను కేంద్రం తోసిపుచ్చింది. వాణిజ్యపరమైన అవసరాలను బట్టి ఏ దేశం నుంచైనా చమురును కొనుగోలు చేసే పూర్తి స్వేచ్ఛ భారతీయ కంపెనీలకు ఉందని, ప్రస్తుతం భారత్ 40కి పైగా దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని మంత్రిత్వ శాఖ వివరించింది.
చమురు రవాణా ప్రక్రియలో గమ్యస్థానాల మార్పు అనేది ఒక సాధారణ పరిణామమని ప్రభుత్వం ఈ సందర్భంగా విశ్లేషించింది. షిప్పింగ్ పత్రాలైన 'బిల్స్ ఆఫ్ లాడింగ్'లో కొన్నిసార్లు గమ్యస్థానాలను కేవలం సూచనాప్రాయంగానే పేర్కొంటారని, వాణిజ్య ప్రయోజనాలు లేదా కార్యాచరణ సౌలభ్యం కోసం సముద్ర ప్రయాణంలో ఉన్న నౌకలు తమ దిశను మార్చుకోవడం అంతర్జాతీయ వాణిజ్యంలో సహజమని స్పష్టం చేసింది. చెల్లింపు సమస్యల వల్లే నౌక మళ్లిందన్న విశ్లేషకుల వాదనల్లో వాస్తవం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. కేవలం చమురు మాత్రమే కాకుండా ఇరాన్ నుంచి ఎల్పీజీ (LPG) సరఫరాపై వస్తున్న నెగిటివ్ వార్తలను కూడా ప్రభుత్వం ఆధారాలతో సహా ఖండించింది.
ఇరాన్కు చెందిన 'సీ బర్డ్' అనే నౌక సుమారు 44 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో ఈ నెల 2వ తేదీనే మంగళూరు పోర్టుకు చేరుకుందని, ప్రస్తుతం సరుకు అన్లోడ్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని ప్రభుత్వం ధృవీకరించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతపై వస్తున్న ఆందోళనలను కేంద్రం నివృత్తి చేసింది. రాబోయే నెలలకు అవసరమైన ముడి చమురు నిల్వలను భారత రిఫైనరీలు ఇప్పటికే వివిధ దేశాల నుంచి భద్రపరుచుకున్నాయని, దేశంలో చమురు సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగబోదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, దేశ ఇంధన అవసరాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.