- Gulf: అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్: ఒమన్ దేశంలో మిన్నంటిన తెలుగువారి సంబరాలు..
- "చారిత్రక విజయం.. అమరావతికే జయం": మస్కట్ వీధుల్లో మారుమోగిన ప్రవాసాంధ్రుల నినాదాలు..
Oman: ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత లభించడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ఒమన్ దేశ రాజధాని మస్కట్లో ఎన్నారై-టీడీపీ (NRI-TDP Oman) విభాగం ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ వేడుకలో మస్కట్లో నివసిస్తున్న తెలుగు ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమరావతికి మద్దతుగా నినాదాలు చేస్తూ తమ సంఘీభావాన్ని చాటారు. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత రాజధాని నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోవడం శుభపరిణామమని వారు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్నారైలు మాట్లాడుతూ, అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం మరియు పార్లమెంటు అధికారికంగా ఆమోదించడం పట్ల తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాజధాని కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన అమరావతి రైతులు మరియు మహిళల త్యాగాలకు దక్కిన విజయమిదని వారు అభివర్ణించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో అమరావతి మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని, ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతుందని ఎన్నారైలు ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ రాష్ట్ర ప్రగతి కోసం తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.