AP Ration Card Updates: రేషన్ కార్డు వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఇకపై కార్డులో పేర్లు మార్చుకోవాలన్నా, కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి దగ్గరలో ఉండే 'మీసేవ' కేంద్రాల్లోనే ఈ పనులన్నీ చక్కబెట్టుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.
గత కొన్నేళ్లుగా రేషన్ కార్డుల్లో మార్పులు చేయాలంటే కేవలం సచివాలయాల ద్వారానే సాధ్యమయ్యేది. దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం లభించినట్లయింది. మొత్తం తొమ్మిది రకాల సేవలను మీసేవ కేంద్రాల పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల పనుల వేగం పెరగడమే కాకుండా, ప్రజలకు సమయం కూడా ఆదా అవుతుంది.
ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన మహిళలు తమ పుట్టింటి కార్డు నుంచి పేరు తొలగించి, అత్తగారి ఇంటి కార్డులో పేరు చేర్చుకోవడానికి ఇప్పుడు మార్గం సుగమమైంది. అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి పేరు తొలగించడం, ఆధార్ కార్డు లింక్ చేయడం, తప్పుగా ఉన్న వివరాలను సరిదిద్దడం వంటి పనులన్నీ మీసేవలో చేసుకోవచ్చు. అయితే కొత్త కార్డుల జారీ కార్డు విభజన (స్ప్లిట్) వంటి సేవలు మాత్రం ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సేవలు పొందాలనుకునే వారు కొన్ని ముఖ్యమైన పత్రాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. కొత్త సభ్యులను చేర్చాలంటే ఆధార్ కార్డుతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రిక వంటివి అవసరమవుతాయి. వివరాల మార్పు కోసం విద్యా ధృవీకరణ పత్రాలు కూడా అడిగే అవకాశం ఉంది. మీ దగ్గర ఉన్న ఆధారాలను బట్టి మీసేవ నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అటు ప్రజలు, ఇటు మీసేవ కేంద్రాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్ళీ అందుబాటులోకి రావడంతో లక్షలాది మందికి లబ్ధి చేకూరనుంది. మీకు కూడా రేషన్ కార్డులో ఏవైనా సవరణలు ఉంటే, వెంటనే మీ దగ్గరలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ అవకాశాన్ని వాడుకోండి.