AP Road Technology: ఏడేళ్ల వరకు రిపేర్లు లేవు.. ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రోడ్ల మ్యాప్ రెడీ!

Road Construction Technology: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మన్నికను పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త డానిష్ ఫైబర్ ప్లాస్టిక్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పద్ధతిలో నిర్మించే రోడ్లు ఏడేళ్ల వరకు మరమ్మతులకు గురికావు

Published : 2026-03-22 19:02:00

డానిష్ టెక్నాలజీతో అదనపు బలం

ప్లాస్టిక్ వ్యర్థాలతో పటిష్టమైన బాటలు

వర్షాకాలం వచ్చినా టెన్షన్ లేదు

AP News Updates: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల రూపురేఖలు త్వరలో మారబోతున్నాయి. గతంలోలాగా వర్షం పడగానే రోడ్లు గుంతలమయం కావడం, ప్రతి ఏటా ప్యాచ్ వర్కులు చేయడం వంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ అత్యాధునిక "డానిష్ ఫైబర్,  ప్లాస్టిక్ టెక్నాలజీ"ని రంగంలోకి దించుతోంది. ఈ కొత్త పద్ధతిలో నిర్మించే రోడ్లు కనీసం ఏడెనిమిదేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

డెన్మార్క్ దేశంలో అభివృద్ధి చేసిన ఈ 'అస్ఫాల్ట్ రీ-ఇన్ఫోర్సింగ్' సాంకేతికత రోడ్లకు వెన్నెముకలా మారుతుంది. సాధారణంగా రోడ్డు వేసేటప్పుడు వాడే తారు (బిటుమిన్) మిశ్రమంలో అరమిడ్, పాలియోలెఫిన్ వంటి ప్రత్యేకమైన ఫైబర్లను కలుపుతారు. దీనివల్ల రోడ్డు ఉపరితలం ఎంతో బలంగా తయారవుతుంది. ముఖ్యంగా వర్షపు నీరు రోడ్డు లోపలికి ఇంకిపోకుండా ఈ ఫైబర్లు అడ్డుకుంటాయి. ఫలితంగా భారీ వర్షాలు కురిసినా తారు లేచిపోవడం, గుంతలు పడటం వంటివి జరగవు. ఇప్పటికే బనగానపల్లె సమీపంలో ప్రయోగాత్మకంగా వేసిన రోడ్డు విజయవంతం కావడంతో, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 122 కిలోమీటర్ల మేర ఈ టెక్నాలజీని వాడుతున్నారు.

మరోవైపు పర్యావరణానికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. తారు మిశ్రమంలో ప్లాస్టిక్‌ను కలిపి వేసే ఈ రోడ్లు నీటిని అస్సలు పీల్చుకోవు. విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, ఎన్టీఆర్ జిల్లా సహా పలు ప్రాంతాల్లో సుమారు 42 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ఈ పద్ధతి వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా రోడ్ల మన్నిక కూడా పెరుగుతుంది. సుమారు 85 కోట్ల రూపాయలతో మొత్తం 164 కిలోమీటర్ల మేర ఈ వినూత్న రోడ్ల పనులకు గుత్తేదారులను కూడా ఎంపిక చేశారు.

వర్షాకాలంలో రోడ్లపై గుంతలు పడితే వెంటనే పూడ్చేందుకు 'ఎకోఫిక్స్ రెడీ మిక్స్' అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెడుతున్నారు. ఉక్కు ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను కెమికల్స్‌తో ప్రాసెస్ చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. ఇది బ్యాగుల రూపంలో అందుబాటులో ఉంటుంది. రోడ్డుపై గుంత పడగానే ఈ మిశ్రమాన్ని వేసి నింపేయవచ్చు. దీనికోసం ప్రత్యేకంగా తారును వేడి చేయాల్సిన అవసరం లేదు. మే నెల నాటికే సుమారు 50 వేల బ్యాగులను సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూన్ నుంచి ఎక్కడ గుంతలు ఏర్పడినా వీటితో వెంటనే మరమ్మతులు చేస్తారు.

ఈ కొత్త తరహా రోడ్లు ఏయే ప్రాంతాల్లో వస్తున్నాయో చూస్తే.. విజయనగరంలో గజపతినగరం-మెంటాడ మార్గం, శ్రీకాకుళంలో ఉప్పినివలస-గుట్టవల్లి రోడ్డు, పశ్చిమ గోదావరిలో భీమవరం రోడ్డు వంటి పలు కీలక మార్గాలను ఎంపిక చేశారు. అనకాపల్లి జిల్లాలో ఈ రెడీ మిక్స్ తయారు చేసే ప్లాంట్ కూడా ఏర్పాటు కాబోతోంది. దీనివల్ల భవిష్యత్తులో రోడ్ల నిర్వహణ కోసం ప్రభుత్వం చేసే అనవసర ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉంది. అధునాతన సాంకేతికతను వాడుకోవడం ద్వారా ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

Spotlight

Read More →