సంక్రాంతి అంటేనే సొంత ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలు, ఆత్మీయుల పలకరింపులు. ఈ ఆనవాయితీని ఏటా కొనసాగించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ ఏడాది కూడా తన స్వగ్రామం నారావారిపల్లెలో పండుగ జరుపుకునేందుకు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం సచివాలయంలో కీలక సమీక్షలు ముగించుకున్న అనంతరం ఆయన నేరుగా హెలికాప్టర్ ద్వారా గ్రామానికి చేరుకోవడంతో నారావారిపల్లెలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు కేవలం సంక్రాంతి వేడుకలకే పరిమితం కాకుండా, తిరుపతి మరియు తన స్వగ్రామ పరిసర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు వెళ్లనున్నారు. రూ.70 లక్షలతో రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు.
నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్, రూ.1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చేలా నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.
ఇక తిరుపతిలో రూ.45 లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామ్నారాయణ్ రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్, ఎస్వీ యూనివర్సిటీలో రూ.7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, రూ.5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించి నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్కు, మూలపల్లి చెరువుతో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా రూ.126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టుకు, రూ.10 లక్షలతో పశువుల వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారు.
ఎస్వీ యూనివర్సిటీలో పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా రూ.6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్స్, విద్యా మౌలిక వసతుల్లో భాగంగా రూ.5.03 కోట్లతో అకడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తుకు, రూ.2.91 కోట్లతో చేపట్టే కాపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు.
15వ తేదీన చంద్రబాబు తన కుటుంబంతో కలిసి గ్రామ దేవత నాగాలమ్మ గుడిని దర్శించుకుంటారు. నారా కుటుంబానికి నాగాలమ్మ ఆరాధ్య దైవం. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పండుగ ముగించుకుని సాయంత్రానికి ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లె పర్యటన అటు పండుగ సరదాను, ఇటు అభివృద్ధి సందడిని రెండింటినీ మోసుకొచ్చింది. ఒకవైపు స్వగ్రామ ప్రజలతో ఆనందాన్ని పంచుకుంటూనే, మరోవైపు రూ. కోట్లాది ప్రాజెక్టులతో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి బాటలు వేయడం గమనార్హం.