భారత రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ (NTPC UG) సీబీటీ–2 (2024) రాత పరీక్షలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ముందస్తు సన్నద్ధత కల్పించేందుకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) కీలక నిర్ణయం తీసుకుంది. సీబీటీ–2 పరీక్షలకు సంబంధించిన ఉచిత ఆన్లైన్ మాక్ టెస్టులను అభ్యర్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్ 20వ తేదీ నుంచి సీబీటీ–2 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సదుపాయం అభ్యర్థులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ఆర్ఆర్బీ విడుదల చేసిన ఈ మాక్ టెస్టులను ఎలాంటి పాస్వర్డ్ అవసరం లేకుండా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఉచితంగా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. మాక్ టెస్టుల ద్వారా కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం, ప్రశ్నల స్వరూపం, సమయ నిర్వహణ వంటి అంశాలపై అభ్యర్థులకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ముఖ్యంగా మొదటిసారి ఆన్లైన్ పరీక్షలు రాసే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మాక్ టెస్టులు రాయడం వల్ల అసలు పరీక్ష సమయంలో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా, ధైర్యంగా పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవల్–2 పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 51,978 మంది అభ్యర్థులు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థులు షిఫ్ట్ల వారిగా వివిధ పరీక్ష కేంద్రాల్లో సీబీటీ–2 పరీక్షలకు హాజరుకానున్నారు. గత ఏడాది మొత్తం 3,445 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు సిటీ ఇంటిమేషన్ స్లిప్లను విడుదల చేసిన ఆర్ఆర్బీ, పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు సంబంధించి వివిధ నాన్–టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలు రైల్వే శాఖలో స్థిరమైన కెరీర్కు దారితీసే అవకాశాలు కల్పిస్తుండటంతో అభ్యర్థుల్లో భారీ ఆసక్తి నెలకొంది. సీబీటీ–2 పరీక్షల్లో మంచి ప్రతిభ చూపిన అభ్యర్థులు తదుపరి దశలకు ఎంపిక కానున్నారు. అందుకే మాక్ టెస్టులను పూర్తిగా ఉపయోగించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలని ఆర్ఆర్బీ అభ్యర్థులకు సూచిస్తోంది.