ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్రాన్ని పూర్తిగా “అన్లాక్” చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF)లో పాల్గొన్న సీఎం, పలు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వేగవంతమైన అనుమతులు, ప్రోత్సాహక ప్యాకేజీలతో ఏపీని ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
సదస్సులో భాగంగా తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్తో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో ఉన్న అపార అవకాశాలను ఆమెకు వివరించారు. ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించామని, పెట్టుబడిదారులకు అన్ని రకాల ప్రభుత్వ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరప్రాంతం, కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని సీఎం తెలిపారు. ప్రకృతి, సంస్కృతి, ఆధ్యాత్మిక పర్యటనలను కలిపి కొత్త టూరిజం మోడల్ను అమలు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనను ఆయన వివరించారు.
ఈ ప్రతిపాదనలకు తమారా లీజర్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు, విశాఖపట్నం వంటి నగరాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా, పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ దృక్పథం తమకు నచ్చిందని వారు తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగం కొత్త దశలోకి అడుగుపెట్టే అవకాశముందని అధికారులు అభిప్రాయపడ్డారు.
మరోవైపు, కాలిబో ఏఐ అకాడెమీ వ్యవస్థాపకులు రాజ్ వట్టికూటితోనూ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఇప్పటికే అమరావతిలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో యువతకు ఏఐ శిక్షణ అందిస్తున్నామని కాలిబో ప్రతినిధులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర విశ్వవిద్యాలయాలకు విస్తరించాలని సీఎం సూచించారు. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్లో “సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్” ఏర్పాటు చేయాలని కాలిబో ఏఐ సంస్థను ఆహ్వానించారు. ఏఐ రంగంలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసి, ఏపీని టెక్నాలజీ హబ్గా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు.