Devotional- అక్షయ తృతీయ వేళ బాబా కేదార్నాథ్ సన్నిధికి వేలాది మంది భక్తులు.
రికార్డు స్థాయి రిజిస్ట్రేషన్లు…
కేదార్నాథ్ యాత్రకు 4.5 లక్షల మందికి పైగా భక్తులు సిద్ధం.
పుష్పాలతో వెలిగిపోతున్న కేదార్నాథ్ క్షేత్రం..
Kedarnath 2026: ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ఆరు నెలల శీతాకాల విరామం తర్వాత భక్తుల దర్శనం కోసం నేడు (22 ఏప్రిల్ 2026) ఘనంగా తెరుచుకున్నాయి. ఉదయం 8 గంటలకు వైదిక మంత్రోచ్ఛారణల మధ్య బాబా కేదార్నాథ్ సన్నిధిని తెరిచినప్పుడు హిమాలయ పర్వత శ్రేణులు శివనామ స్మరణతో మార్మోగిపోయాయి. అక్షయ తృతీయ శుభ ఘడియల్లో బాబా డోలీ (ఉత్సవమూర్తి) ఉఖీమఠ్ నుంచి కేదార్నాథ్ ధామ్కు చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణాన్ని సుమారు 50 క్వింటాళ్ల వివిధ రకాల పుష్పాలతో అద్భుతంగా అలంకరించారు.
ఈ ఏడాది కేదార్నాథ్ యాత్రకు భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. దర్శనం కోసం రికార్డు స్థాయిలో ఇప్పటికే 4.5 లక్షల మందికి పైగా భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. తొలిరోజు వేలాది మంది భక్తులు మంచుతో నిండిన కొండల మధ్య బాబాను దర్శించుకునేందుకు తరలివచ్చారు. యాత్రికుల సౌకర్యార్థం ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరియు బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాయి. నవంబర్ వరకు కొనసాగే ఈ యాత్ర ద్వారా ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.