Kidney Stones Prevention: వేసవి కాలం వచ్చిందంటే చాలు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఎండల వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సమయంలో చాలా మందిని వేధించే ప్రధాన సమస్య 'కిడ్నీలో రాళ్లు'. శరీరంలో నీరు తగ్గడం వల్ల మూత్రం చిక్కబడి, ఖనిజ లవణాలు పేరుకుపోయి రాళ్లుగా మారుతాయి. అయితే, మన ఇంట్లోనే దొరికే కొబ్బరి నీళ్లు, సబ్జా గింజలతో ఈ ముప్పును తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ వేసవిలో ఈ రెండింటి కలయిక మనల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం.
శరీరాన్ని చల్లబరచడంలో కొబ్బరి నీళ్లకు మించినది మరొకటి లేదు. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కొబ్బరి నీళ్లు ఒక సహజమైన 'డైయూరిటిక్'గా పనిచేస్తాయి. అంటే ఇవి మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. దీనివల్ల కిడ్నీలలో స్ఫటికాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. రోజుకో గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేరవని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
ఇక సబ్జా గింజల విషయానికి వస్తే, వీటిని 'సమ్మర్ కూలర్స్' అని పిలుస్తారు. నీటిలో నానబెట్టిన సబ్జా గింజలు శరీరంలోని వేడిని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో పీచు పదార్థం యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం చలవ చేయడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, సబ్జా గింజల్లో ఆక్సలేట్ పరిమాణం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని పరిమితంగా తీసుకోవడమే మంచిది. మరీ ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.
కొబ్బరి నీళ్లలో కొంచెం నానబెట్టిన సబ్జా గింజలను కలుపుకుని తాగితే ఆ రుచే వేరు, ఆరోగ్యమూ వేరు. ఈ మిశ్రమం డీహైడ్రేషన్ నుండి కాపాడటమే కాకుండా, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. ఎండలో బయటకు వెళ్లి వచ్చినప్పుడు లేదా నీరసంగా అనిపించినప్పుడు ఈ డ్రింక్ తాగితే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే రోజుకు 100 నుండి 150 మి.లీ. కొబ్బరి నీళ్లు, ఒక చెంచా సబ్జా గింజలు తీసుకోవడం సరిపోతుంది. అతిగా ఏది తిన్నా, తాగినా అనర్థమే అన్న విషయం మర్చిపోకూడదు సుమీ..
కేవలం పానీయాల మీదనే ఆధారపడకుండా రోజుకు కనీసం 3 నుండి 4 లీటర్ల మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. వేసవిలో వచ్చే కిడ్నీ రాళ్లను నివారించాలంటే శరీరానికి తగినంత తేమ అందించడం ఒక్కటే మార్గం. ఆహారంలో ఉప్పు తగ్గించడం, తాజా పండ్లు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే ఈ ఎండాకాలాన్ని ఆరోగ్యంగా గడపవచ్చు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం సొంత వైద్యం కాకుండా డాక్టర్లను సంప్రదించి సరైన డైట్ ప్లాన్ తీసుకోవడం ఎంతో మంచిది.