Junk Food Health Risks: సాయంత్రం అయిందంటే చాలు.. వేడివేడి సమోసాలు, ఘుమఘుమలాడే పానీపూరీలపై మన మనసు లాగుతుంది. ఆ రుచికి ఫిదా అయిపోయి ప్లేట్ల మీద ప్లేట్లు లాగించేస్తుంటాం. కానీ, ఆ కాసేపటి రుచి వెనుక మన ఆరోగ్యం ఎంతలా దెబ్బతింటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం తినే ఒక్క చిన్న సమోసా వల్ల వచ్చే క్యాలరీలను కరిగించాలంటే కనీసం నాలుగు కిలోమీటర్లు నడవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ అనేది ఇప్పుడు ఒక వ్యసనంలా మారిపోతోందని, ఇది పొగాకు వాడకం కంటే ప్రమాదకరమని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.
చాలామందికి జంక్ ఫుడ్ తినడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఒకసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేలా వీటిని తయారు చేస్తారు. ముఖ్యంగా బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఆహారాలు మన మెదడుపై ప్రభావం చూపుతాయని హెల్సింకి యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కేవలం బరువు పెరగడమే కాకుండా.. గుండె జబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మనల్ని చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
మనం రోజూ సరదాగా తినే చిరుతిళ్లు కరగాలంటే ఎంత శ్రమించాలో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు, మీరు ఒక 50 గ్రాముల ఆలూ చిప్స్ ప్యాకెట్ తింటే, ఆ క్యాలరీలను కరిగించడానికి 40 నిమిషాల పాటు వేగంగా నడవాలి. అలాగే, ఒక గ్లాసు కూల్ డ్రింక్ తాగితే 20 నిమిషాలు ఈత కొట్టాలి. అందరికీ ఇష్టమైన పానీపూరీ కేవలం ఆరు తిన్నా సరే.. అర గంట పాటు బ్రిస్క్ వాక్ చేయాల్సిందే. మీరు ఒక ప్లేట్ నూడుల్స్ గానీ, మంచూరియా గానీ తిన్నట్లయితే, ఆ ఎనర్జీని ఖర్చు చేయడానికి గంటన్నర పాటు రన్నింగ్ చేయాలి.
ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో పిల్లలు చిన్నప్పటి నుంచే చాక్లెట్లు, కేకులు, ఫాస్ట్ ఫుడ్స్ కు అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడుతున్నారు. సంప్రదాయబద్ధంగా ఇంట్లో వండుకునే ఆహారాన్ని కాదని, బయట దొరికే రంగురంగుల ప్యాకెట్ ఫుడ్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారి ఎదుగుదల దెబ్బతింటోంది. కాబట్టి, పిల్లలకు పండ్లు, కూరగాయలు మరియు పౌష్టికాహారం అలవాటు చేయడం ఎంతో అవసరం.
నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. జంక్ ఫుడ్ పూర్తిగా మానేయడం ఒక మార్గం అయితే, తప్పనిసరి పరిస్థితుల్లో తిన్నప్పుడు ఆ క్యాలరీలను కరిగించేలా వ్యాయామం చేయడం రెండో మార్గం. ఈ రెండూ చేయకపోతే మాత్రం అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల చనిపోయే వారి కంటే, ఆహారపు అలవాట్ల వల్ల మరణించే వారి సంఖ్య కోటికి పైగా ఉండటం గమనార్హం. కాబట్టి, రుచి కోసం రోగాన్ని ఆహ్వానించకుండా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకుందాం.