భారత్కు గుడ్ న్యూస్.. విశాఖకు చేరువలో ఆయిల్ ట్యాంకర్..
ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ దాటిన చమురు నౌక..
ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు ఊరటనిచ్చే వార్త వెలువడింది. భారత్కు అవసరమైన ముడి చమురును తీసుకువస్తున్న “నిస్సోస్ కెరోస్” అనే ఆయిల్ ట్యాంకర్ హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. ప్రస్తుతం ఈ నౌక విశాఖపట్నం వైపు ప్రయాణిస్తుండగా, జూన్ 3న చేరుకునే అవకాశం ఉందని సముద్ర రవాణా ట్రాకింగ్ సంస్థలు వెల్లడించాయి.
మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ నౌక మే 21న షార్జా నుంచి బయలుదేరింది. ప్రస్తుతం భారత పశ్చిమ తీరానికి సమీపంలోని ఉత్తర అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇటీవల హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న సమయంలో ఈ నౌక సురక్షితంగా దాటడం భారత్కు గుడ్ న్యూస్గా భావిస్తున్నారు.
ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ప్రకారం, గత 24 గంటల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ ఆధ్వర్యంలో 23 వాణిజ్య నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా సురక్షిత మార్గం కల్పించారు. అయితే సముద్ర మార్గాల వినియోగంపై కొత్త రవాణా నియంత్రణ వ్యవస్థను తీసుకురావాలని ఇరాన్ ప్రతిపాదించడంతో అంతర్జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది.
ఐక్యరాజ్యసమితి మాత్రం అంతర్జాతీయ జలాల్లో ప్రయాణ రుసుములు విధించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి మద్దతు తెలిపారు.
ప్రపంచ చమురు, వాయు రవాణాలో దాదాపు 20 శాతం ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. అందువల్ల అక్కడి పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్ నియంత్రణ చర్యలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ఆర్థిక ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో భారత్కు వస్తోన్న ఈ చమురు నౌక సురక్షితంగా ప్రయాణించడం కొంత ఉపశమనం కలిగించే అంశంగా మారింది.