- Gulf: "స్క్రిప్ట్ అమెరికాది.. వాయిస్ పాకిస్థాన్దా?": షెహబాజ్ షరీఫ్ ట్వీట్ ఎడిట్ హిస్టరీపై నెటిజన్ల ట్రోల్స్..
- "రెండు వారాల గడువు.. ట్రంప్ ఓకే": పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై అంతర్జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు..
Iran War: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను తొలగించి, ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు పాకిస్థాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా ఎల్లుండి రెండు దేశాల ప్రతినిధుల మధ్య కీలక చర్చలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు తీవ్ర చర్చకు దారితీసింది. యుద్ధానికి ముగింపు పలకడం అత్యవసరమని అభిప్రాయపడిన ఆయన, చర్చల ప్రక్రియ సజావుగా సాగేందుకు రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇరు పక్షాలను కోరారు. అయితే, ఈ శాంతి ప్రతిపాదన వెనుక అసలు మాస్టర్ మైండ్ పాక్ ప్రధాని కాదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కనుసన్నుల్లోనే ఈ వ్యవహారం అంతా నడుస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
పాకిస్థాన్ ప్రధాని చేసిన ఈ పోస్టుకు ముందే అమెరికాకు ఈ విషయంపై పూర్తి స్పష్టత ఉందని, ఇరాన్కు రెండు వారాల గడువు ఇచ్చేందుకు ట్రంప్ అంగీకరించిన తర్వాతే ఈ ప్రతిపాదన బయటకు వచ్చిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. షెహబాజ్ షరీఫ్ పంచుకున్న సందేశాన్ని తెరవెనుక వైట్ హౌస్ అధికారులు క్షుణ్ణంగా సమీక్షించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, ఆయన చేసిన పోస్టులో తొలుత "డ్రాఫ్ట్-ఎక్స్లో పాకిస్థాన్ ప్రధాని సందేశం" (Draft-Message of Pakistan PM on X) అనే వాక్యం కనిపించడం, ఆ వెంటనే దానిని ఎడిట్ చేసి తొలగించడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది. ఇది కేవలం కాపీ-పేస్ట్ పొరపాటని కొందరు కొట్టిపారేస్తున్నా, ట్రంప్ బృందమే ఈ సందేశాన్ని రూపొందించి పాక్ ప్రధాని ద్వారా పోస్ట్ చేయించిందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయినప్పటికీ, ఈ వాదనలను వైట్ హౌస్ అధికారికంగా తోసిపుచ్చింది.