ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వేటు తప్పదు…
ముఖ్యమంత్రి పిలుపుపై హేళన.. సోషల్ మీడియాలో అతిగా వాగి జైలు పాలు….
టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసేలా పోస్టులు…
Headmaster Suspension Prakasam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తాళ్లూరు ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దద్దాల శ్రీనివాస్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. "రాష్ట్రంలో జనాభా పెరగాలి.. ఎక్కువ మంది పిల్లలను కనాలి" అని సీఎం చంద్రబాబు ఇటీవల ఇచ్చిన పిలుపును హేళన చేస్తూ శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ప్రవర్తన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని భావించిన విద్యాశాఖ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
హెడ్మాస్టర్ శ్రీనివాస్ కేవలం ప్రస్తుత వ్యాఖ్యలకే పరిమితం కాకుండా, గత ఏడాది కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అవమానించేలా, టీడీపీ ప్రతిష్టను దెబ్బతీసేలా వరుసగా పోస్టులు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పక్షపాతంతో వ్యవహరించడం, వ్యక్తుల మధ్య వివాదాలు సృష్టించేలా సోషల్ మీడియాను వాడుకోవడంపై స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతున్నారని వారు మండిపడ్డారు.
ఈ వ్యవహారంపై స్థానిక టీడీపీ నేత మోహన్ మురళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి గౌరవానికి భంగం కలిగించడమే కాకుండా, ప్రజల్లో తప్పుడు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల ప్రాథమిక విచారణ అనంతరం, విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లా విద్యాశాఖాధికారిణి (DEO) సీవీ రేణుకా ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉన్నప్పటికీ, బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ హుందాతనాన్ని కోల్పోవడం సహించబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటన జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.