భారతీయులు ఫు క్వాక్ దీవికి వీసా లేకుండా వెళ్లవచ్చు..
భారత రాయబార కార్యాలయం కీలక హెచ్చరికలు..
వియత్నాం దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం Phu Quoc ఐలాండ్ ప్రస్తుతం భారతీయుల కోసం ఆకర్షణీయమైన హాలిడే డెస్టినేషన్గా మారుతోంది. తెల్లని ఇసుక తీరాలు, లగ్జరీ రిసార్టులు, ప్రశాంత వాతావరణం కారణంగా ఈ దీవికి భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్లుతున్నారు. ముఖ్యంగా 30 రోజుల పాటు వీసా లేకుండా ప్రవేశానికి అనుమతి ఉండటం దీనికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.
అయితే, హానొయ్ లోని భారత ఎంబసీ తాజాగా భారతీయులకు కీలక సూచనలు జారీ చేసింది. ఫు క్వాక్ దీవికి మాత్రమే వెళ్లాలనుకున్నా కూడా ముందుగానే వియత్నాం వీసా తీసుకోవాలని సూచించింది.
ప్రస్తుతం భారతీయులు ఫు క్వాక్ దీవికి వీసా లేకుండా వెళ్లవచ్చు. అయితే ఈ అనుమతి పూర్తిగా ఆ దీవి వరకే పరిమితం. వియత్నాం ప్రధాన భూభాగంలోని నగరాలు—హో చి మిన్ సిటీ, హనోయి వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ వీసా-ఫ్రీ అనుమతి వర్తించదు. ప్రయాణికులు నేరుగా దీవికే చేరుకుని, అక్కడే తమ పర్యటన ముగించాలి.
రాయబార కార్యాలయం ప్రకారం, కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు, ఫ్లైట్ ఆలస్యాలు లేదా ఇతర అవసరాల వల్ల ప్రధాన భూభాగానికి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటి సమయంలో సరైన వీసా లేకపోతే ఆసుపత్రి సేవలు పొందడంలో ఆలస్యం, ప్రయాణ ఆంక్షలు, ఇమ్మిగ్రేషన్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే ముందుగానే వీసా తీసుకోవడం ద్వారా ఇలాంటి ఇబ్బందులను నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
వియత్నాంలో పర్యటనలో ఉన్నప్పుడు పాస్పోర్ట్ పోయిన ఘటనలు కూడా కొన్ని చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. అలాంటి సమయంలో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఆ తర్వాత ఆ రిపోర్ట్ను హానొయ్ లోని భారత ఎంబసీ లేదా హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్కు సమర్పించాలి.
పాస్పోర్ట్ పోయిన వారికి భారత రాయబార కార్యాలయం నుంచి ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేస్తారు. సాధ్యమైనంత త్వరగా, కొన్నిసార్లు అదే రోజులో కూడా ఇది అందిస్తారు.
అయితే, వియత్నాం అధికారుల నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొందడానికి సాధారణంగా 3 నుంచి 5 పని రోజుల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఇంకా ఎక్కువ కాలం తీసుకోవచ్చు. ఆ సమయంలో ప్రయాణికులు వియత్నాంలోనే ఉండాల్సి ఉంటుంది.
మొత్తానికి, ఫు క్వాక్ దీవి పర్యటన ఎంతో అందమైన అనుభవం అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ప్రయాణానికి ముందు పూర్తి సమాచారం సేకరించి, అవసరమైన వీసా తీసుకుని వెళ్లడం ద్వారా సురక్షితమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని రాయబార కార్యాలయం సూచించింది.