జనసేన పార్టీలో క్రమశిక్షణ, బాధ్యత విషయంలో ఇకపై రాజీ పడే ప్రసక్తే లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ పదవుల్లో ఉండి, ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు కేవలం ప్రోటోకాల్కు మాత్రమే పరిమితం కాకుండా, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు.
ముఖ్యంగా గత కొద్ది రోజులుగా పార్టీపై మరియు వ్యక్తిగతంగా తనపై ప్రత్యర్థులు చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో నేతలు విఫలమవుతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. పార్టీపై విషం చిమ్ముతుంటే చూస్తూ ఊరుకుంటారా అబద్ధపు ప్రచారాలు జరుగుతుంటే ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత మీపై లేదా? ప్రతి అంశంపై నేనే స్పందించాలా?" అంటూ ఆయన నేతలను నిలదీశారు. పదవులు అనుభవించడమే కాదు, పార్టీకి ఆపద వచ్చినప్పుడు అండగా నిలవాలని ఆయన హితబోధ చేశారు.
పార్టీలో ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు కేవలం ఫోజులకే పరిమితమవుతున్నారు అనే విషయంలో తన వద్ద పూర్తి సమాచారం ఉందని పవన్ హెచ్చరించారు. "అందరి జాతకాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు ఎంత పని చేస్తున్నారో అన్నీ గమనిస్తున్నాను. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిని సహించేది లేదు అని ఆయన అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యంగా వివాదాస్పద అంశాల్లో పార్టీ స్టాండ్ను బలంగా వినిపించాలని, వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పాలని దిశానిర్దేశం చేశారు.
వచ్చే మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో, అప్పటిలోగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 32 మంది సభ్యులతో త్వరలోనే ఒక క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అరవ శ్రీధర్ వ్యవహారం వంటి అంతర్గత సమస్యలపై ఇప్పటికే విచారణ కమిటీలు వేశామని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఈ సమావేశం ద్వారా పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉన్న తరుణంలో, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూనే, ప్రభుత్వ వైఫల్యాలు లేకుండా చూడాల్సిన బాధ్యత నేతలపై ఉందని నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.