అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణుల కోసం ఇచ్చే హెచ్-1బి వీసా విధానంలో యూఎస్ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) అధికారికంగా ప్రకటించింది. ఈసారి నిబంధనలు గతంతో పోలిస్తే మరింత కఠినంగా ఉండటంతో విదేశీ ఉద్యోగార్థుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఐటీ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ రంగాల్లో అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న వారికి ఈ మార్పులు కీలకంగా మారనున్నాయి. కొత్త విధానాల ద్వారా కేవలం అధిక నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
USCIS ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ మార్చి 19గా నిర్ణయించారు. అనంతరం లాటరీ ఫలితాలను మార్చి 31వ తేదీన ప్రకటించనున్నారు. ఈసారి కూడా ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసిన వారిలో నుంచే అర్హులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులే ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో హెచ్-1బి వీసా పిటిషన్లు దాఖలు చేయడానికి అర్హులు అవుతారు. నియామక సంస్థలు ముందుగా USCIS వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసి తమ ఉద్యోగుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇక ఈసారి వీసా ప్రక్రియలో అత్యంత చర్చనీయాంశంగా మారింది భారీ ఫీజు పెంపు. ట్రంప్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్లో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని హై-స్కిల్డ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా 1,00,000 డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా వెలుపల నుంచి వీసా కోసం దరఖాస్తు చేసే వారికి ఈ అదనపు భారం తప్పనిసరి కానుంది. అంతేకాదు, ప్రాథమిక హెచ్-1బి రిజిస్ట్రేషన్ ఫీజును కూడా గతంలో ఉన్న 10 డాలర్ల నుంచి ఏకంగా 215 డాలర్లకు పెంచారు. ఈ నిర్ణయం కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం మోపనుంది.
మరోవైపు, ఇప్పటివరకు అమల్లో ఉన్న రాండమ్ లాటరీ విధానానికి బదులుగా ఈసారి ‘వెయిటేజ్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఎక్కువ జీతం ఆఫర్ చేసే ఉద్యోగాలకు, అధిక నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు హెచ్-1బి వీసా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మార్పుతో అమెరికా మార్కెట్కు అవసరమైన అత్యుత్తమ టాలెంట్ను మాత్రమే ఎంపిక చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ భారీ ఫీజు పెంపుపై పలు ఐటీ కంపెనీలు, వాణిజ్య మండళ్లు కోర్టును ఆశ్రయించినప్పటికీ, కోర్టు ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది దరఖాస్తు చేసే వారు ఈ ఖర్చుకు సిద్ధంగా ఉండాల్సిందే. ముఖ్యంగా చిన్న కంపెనీలు, స్టార్టప్లు ఈ నిబంధనల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.