రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో సాయం అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో చాలామంది ప్రమాద స్థలంలో సాయం చేసేందుకు వెనకాడుతుంటారు. ఇలాంటి భయాలను పోగొట్టి, మానవత్వాన్ని చాటుకునేలా కేంద్ర రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ రహ్ వీర్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ రవాణా కమిషనర్ మనీష్కుమార్ సిన్హా తాజాగా స్పష్టత ఇచ్చారు.
ప్రమాదం జరిగిన మొదటి గంటను 'గోల్డెన్ అవర్' గా పరిగణిస్తారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే బతికే అవకాశాలు 90 శాతం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఎవరైనా వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు ఆ బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని ఈ పథకం కింద 'రహ్ వీర్'గా గుర్తిస్తారు.
నగదు బహుమతి: ప్రాణాలు కాపాడిన వారికి గతంలో రూ. 5 వేలు ఇచ్చేవారు, ప్రస్తుతం దానిని రూ. 25,000 కు పెంచారు.
ప్రశంసా పత్రం: నగదుతో పాటు ప్రభుత్వం తరపున అధికారిక అభినందన పత్రాన్ని అందజేస్తారు.
జాతీయ స్థాయి గుర్తింపు: ఏటా దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 10 మంది రహ్ వీర్లను ఎంపిక చేసి, వారికి రూ. 1 లక్ష నగదు, సర్టిఫికేట్ మరియు ట్రోఫీతో గౌరవిస్తారు.
ప్రమాద బాధితుడిని ఆస్పత్రికి చేర్చిన వెంటనే అక్కడి వైద్యులు సహాయం చేసిన వ్యక్తికి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ (ధృవీకరణ పత్రం) ఇస్తారు. అనంతరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ప్రతి నెలా సమావేశమై, వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుంది. అర్హులైన వారి జాబితాను రాష్ట్ర కమిటీకి పంపిస్తారు. తుది ఎంపిక పూర్తయిన తర్వాత రివార్డు సొమ్ము నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే వారిని పోలీసులు ఎలాంటి వేధింపులకు గురి చేయకూడదని, వారి వివరాలు చెప్పాలని ఒత్తిడి చేయకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్పందించి, ఆపదలో ఉన్నవారిని కాపాడి 'రహ్ వీర్'లుగా నిలవాలని రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు