హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో హజ్ సదుపాయాలపై మంత్రి ఫరూక్ సమీక్ష..
హజ్ యాత్రికుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..
అమరావతి: హజ్ యాత్ర-2026 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మైనారిటీ, న్యాయశాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు.
ఈ సమీక్షలో రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారుడు ఎంఏ షరీఫ్, శాఖ కార్యదర్శి సిహెచ్ శ్రీధర్, హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష, సీఈఓ గౌస్ పీర్ తదితరులు పాల్గొన్నారు. యాత్రికుల సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.
మంత్రి ఫరూక్ వివరించిన ప్రకారం, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 2000 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 18, 19 తేదీలలో రెండు విడతలుగా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి 333 మంది యాత్రికులు బయలుదేరారు. మిగిలిన యాత్రికులు హైదరాబాద్, బెంగళూరు ఎంబార్కేషన్ కేంద్రాల ద్వారా ప్రయాణం చేయనున్నారు.
మే 4 నుంచి 21 తేదీల మధ్యలో దశలవారీగా యాత్రికులు బయలుదేరనున్నారు. ఇందులో హైదరాబాద్ నుండి 1202 మంది, బెంగళూరు నుండి 447 మంది ప్రయాణం చేయనున్నారు. వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
హజ్ యాత్రికుల కోసం ఎంబార్కేషన్ కేంద్రాల్లో పరిశుభ్రమైన వసతి, నాణ్యమైన భోజనం, తాగునీటి సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులైన యాత్రికుల కోసం ప్రత్యేక సహాయ సేవలు ఏర్పాటు చేయాలని చెప్పారు. నోడల్ అధికారులను నియమించి ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.
విమానాశ్రయాల్లో ప్రథమ చికిత్స, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే భద్రతా ఏర్పాట్లు, గుర్తింపు ధృవీకరణ, రద్దీ నియంత్రణ చర్యలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు.
చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియలను సులభతరం చేయాలని, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి యాత్రికులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని ఆదేశించారు. విమానాల రాకపోకలు, లగేజీ నిబంధనలు, అవసరమైన డాక్యుమెంట్లపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
హైదరాబాద్, బెంగళూరు కేంద్రాల్లో ఏర్పాట్ల కోసం ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం, హజ్ కమిటీలతో సమన్వయంగా పని చేయాలని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు. రోజువారీ సమీక్షలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. హజ్ యాత్ర సాఫల్యంగా పూర్తి చేసి సురక్షితంగా తిరిగి రావాలని కోరుతూ, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ యాత్రికులకు విజ్ఞప్తి చేశారు.