- నిశ్శబ్దంగా పేలుతున్న టైం బాంబ్: పిల్లల మెదడుపై సోషల్ మీడియా దాడి..
- లైక్స్ పొట్ట నింపవు.. ఫాలోవర్స్ కెరీర్ ఇవ్వరు..
నేడు మన ఇళ్లలో, మన కళ్ల ముందే నిశ్శబ్దంగా ఒక టైం బాంబ్ పేలుతోంది. అది మరేదో కాదు, టీనేజ్ పిల్లల చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ మరియు అందులోని సోషల్ మీడియా. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న 'నిబ్బా-నిబ్బీ' సంస్కృతి, బహిరంగంగా బూతులు తిట్టుకోవడం, మరియు వ్యక్తిగత విషయాలను కాంటెంట్గా మార్చుకోవడం మన సమాజానికి ఒక క్యాన్సర్ లాగా మారుతోంది.
ఈ 'నిబ్బా నిబ్బీ' ట్రెండ్ వెనుక ఉన్న ప్రమాదం…
మనం తరచుగా సోషల్ మీడియాలో 16-17 ఏళ్ల పిల్లలు స్కూల్ యూనిఫామ్ వేసుకోవాల్సిన వయసులో, పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులతో కెమెరాలు పట్టుకుని మెచ్యూర్డ్ కపుల్స్ లాగా ప్రవర్తించడం చూస్తున్నాం. వీరు పబ్లిక్ గా లిప్ కిస్సులు పెట్టుకోవడం, ఒకరి కోసం ఒకరు చచ్చిపోతామని శపథాలు చేయడం, మళ్ళీ నాలుగు రోజులకే బ్రేకప్ వీడియోలు పెట్టి ఏడవడం ఒక నిరంతర ప్రక్రియగా మారింది. ఇది కేవలం పిల్లకుక్కల గొడవ కాదు, ఇదొక అటెన్షన్ ఎకానమీ. అంటే, జనం కోప్పడినా, తిట్టినా ఆ అల్గారిథమ్ దాన్ని వైరల్ చేస్తుంది. దీనినే 'రేజ్ బైటింగ్' అంటారు. మీ కోపమే వారి వీడియోలకు పెట్రోల్ లాగా పనిచేస్తోంది.
న్యూరో సైన్స్ ఏం చెబుతోంది?
పిల్లలు ఎందుకు ఇంత వింతగా ప్రవర్తిస్తున్నారో శాస్త్రీయంగా చూస్తే, మనిషి మెదడులో నిర్ణయాలు తీసుకునే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే భాగం 25 ఏళ్ల వరకు పూర్తిగా అభివృద్ధి చెందదు. అందుకే వారికి భవిష్యత్తు గురించి, ఈ వీడియోల వల్ల కెరీర్ ఎలా నాశనం అవుతుందో ఆలోచించే శక్తి ఉండదు. వారికి కేవలం ఆ క్షణంలో వచ్చే లైక్స్ అనే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ మాత్రమే కనిపిస్తుంది. దీన్ని 'మైక్రో సెలబ్రిటీ సిండ్రోమ్' అని కూడా పిలుస్తారు.
ఆస్ట్రేలియా తీసుకున్న సంచలన నిర్ణయం..
ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం, తమ దేశంలోని 16 ఏళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ చట్టం తెచ్చింది. దీనివల్ల రాత్రికి రాత్రే 47 లక్షల మంది టీనేజర్ల అకౌంట్లు డిలీట్ అయ్యాయి. వారు కేవలం ఆధార్ కార్డులను నమ్మకుండా, 'ఏజ్ రిఫరెన్స్ టెక్నాలజీ' అనే అడ్వాన్స్డ్ ఏఐ ద్వారా పిల్లల బిహేవియర్ ని బట్టి వారి వయసును పసిగట్టి అకౌంట్లను బ్లాక్ చేస్తున్నారు. ఒకవేళ కంపెనీలు రూల్ బ్రేక్ చేస్తే దాదాపు 270 కోట్ల రూపాయల ఫైన్ విధిస్తున్నారు.
మన తెలుగు రాష్ట్రాల్లో మార్పు మొదలైందా?
ఆస్ట్రేలియా బాటలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. ఐటీ మంత్రి నారా లోకేష్ గారు ఈ సమస్య తీవ్రతను గుర్తించి, 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నియంత్రణపై ఒక కమిటీని వేశారు. ఇందులో కేవలం ఐటీ శాఖే కాకుండా హోమ్ మరియు హెల్త్ మినిస్టర్లు కూడా ఉండటం విశేషం. అంటే దీన్ని ఒక టెక్నాలజీ సమస్యగా మాత్రమే కాకుండా, క్రైమ్ మరియు మానసిక ఆరోగ్య సమస్యగా ప్రభుత్వం చూస్తోంది.
తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి?
ఇది తల్లిదండ్రులు వర్సెస్ పిల్లల యుద్ధం కాదు, ఇది తల్లిదండ్రులు వర్సెస్ సూపర్ కంప్యూటర్ల యుద్ధం. లక్షల కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన అల్గారిథమ్స్ ని మీ బెదిరింపులు ఆపలేవు. అందుకే (#WaitUntil16) అనే నినాదంతో, పిల్లలకు 16 ఏళ్లు వచ్చే వరకు స్మార్ట్ఫోన్ ఇవ్వకపోవడమే మంచిది. వారికి సోషల్ మీడియా భ్రమల కంటే, నిజ జీవితంలోని విలువలను, ఆర్థిక స్థిరత్వాన్ని (Financial Stability) అలవాటు చేయాలి. లైక్స్ పొట్ట నింపవని, ఫాలోవర్స్ కంటే కెరీర్ ముఖ్యమని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.