- తిరుమలలో సంచలనం: అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు..
- సీఎంవో కీలక అధికారికి టీటీడీ బాధ్యతలు..
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలనా యంత్రాంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు భారీ మార్పులు చేసింది. గత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీకి గురైందన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న సిట్ (SIT) నివేదికను సమర్పించిన నేపథ్యంలో, ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు పడింది.
ఆదివారం మధ్యాహ్నం వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు. వెంటనే టీటీడీ విధుల నుంచి తప్పుకుని, సాధారణ పరిపాలన విభాగం (GAD)లో రిపోర్టు చేయాలని సింఘాల్ను ప్రభుత్వం ఆదేశించింది. ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు స్వీకరించే వరకు తాత్కాలికంగా వెంకయ్య చౌదరికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక విచారణ బృందం (SIT) ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. గతంలో ఈవోగా ఉన్న సమయంలోనే నెయ్యి కొనుగోలు నిబంధనల్లో సడలింపులు ఇవ్వడం వల్ల కల్తీకి అవకాశం ఏర్పడిందని సిట్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. సింఘాల్తో పాటు మాజీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు బాలాజీలపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ సూచించింది. బోర్డు నిర్ణయాలను గుడ్డిగా అమలు చేయడం వల్ల విధి నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందని నివేదికలో వెల్లడైంది.
1993 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలో విశేషమైన అనుభవం ఉన్న అధికారి. 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4 వరకు దాదాపు మూడున్నరేళ్ల పాటు ఈవోగా పనిచేశారు. శ్రీవాణి ట్రస్ట్ వంటి వినూత్న కార్యక్రమాలను అప్పట్లో ప్రవేశపెట్టారు. గతేడాది (2025) సెప్టెంబరులో కేంద్ర సర్వీసు నుంచి వచ్చి రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే, కేవలం ఐదు నెలల కాలంలోనే లడ్డూ వివాదం ఆయన పదవికి ఎసరు తెచ్చింది.
భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డూ విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఈ బదిలీ స్పష్టం చేస్తోంది. కొత్త ఈవో నాయకత్వంలో తిరుమల ప్రసాదాల నాణ్యత మరియు పారదర్శకత మెరుగుపడుతుందని భక్తులు ఆశిస్తున్నారు.