రాష్ట్రాన్ని శుభ్రంగా మార్చేందుకు కఠిన చర్యలు..
పర్యావరణంపై సీఎం కీలక నిర్ణయాలు..
అమరావతి: రాష్ట్రాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట కార్యాచరణతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయించిన లక్ష్యాలు గడువులోపు పూర్తి కాకపోతే కారణాలు విశ్లేషించి చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంపై సమీక్ష నిర్వహిస్తూ సీఎం పలు కీలక సూచనలు చేశారు.
ఈ ఏడాది మార్చి 31 వరకు రూపొందించిన స్వచ్ఛాంధ్ర ర్యాంకులను అధికారులు సీఎంకు వివరించారు. విశాఖపట్నం (92%) మొదటి స్థానంలో నిలవగా, విజయనగరం, గుంటూరు జిల్లాలు 85%తో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, ఏఎస్ఆర్ జిల్లాలు చివరి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా ఏఎస్ఆర్ జిల్లా కేవలం 53% మార్కులతో అట్టడుగున ఉంది. ఇకపై ర్యాంకులు థర్డ్ పార్టీ ద్వారా ఇవ్వాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో ఇంటింటికీ చెత్త సేకరణ, తడి-పొడి చెత్త వేరు చేయడం, చెత్త ప్రాసెసింగ్ 100 శాతం జరగాలని సీఎం ఆదేశించారు. పట్టణాల్లో ఇప్పటివరకు 153 లక్షల టన్నుల చెత్తలో 114 లక్షల టన్నులు తొలగించామని అధికారులు తెలిపారు. మిగిలిన చెత్తను జూన్ కల్లా పూర్తిగా క్లియర్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో పేరుకుపోయిన 10 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త తొలగింపునకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
మున్సిపాలిటీల్లో అవసరమైన చోట కొత్త పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటివరకు చెత్తతో నిండిపోయిన డంపింగ్ యార్డులను శుభ్రపరచి పచ్చని పార్కులుగా మార్చాలని సీఎం అన్నారు.
మ్యాజిక్ డ్రెయిన్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్ ద్వారా మురుగునీటి సమస్య పరిష్కరించడంతో పాటు భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం చేస్తాయని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో చెత్త నిర్వహణ, సోలార్ రూఫ్ టాప్లు, గ్రీనరీ పెంపు, శుభ్రమైన వంటగదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గాలి నాణ్యత పర్యవేక్షణకు ప్రస్తుత 83 కేంద్రాలకు అదనంగా 53 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 633 స్వచ్ఛ రథాల ద్వారా రోజుకు 125 టన్నుల పొడి చెత్త సేకరిస్తున్నారు. గోబర్ ధన్ యూనిట్లు, గ్రీన్ షాప్స్ ద్వారా చెత్తను ఆదాయంగా మారుస్తున్నారు. ఈ ప్లాంట్లు డిసెంబర్ కల్లా పూర్తవుతాయని అధికారులు వెల్లడించారు. ‘స్వచ్ఛ పథం’ పేరుతో గ్రామీణ రోడ్ల శుభ్రత కోసం ప్రత్యేక వాహనాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
10 జిల్లాల్లో 590 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. 2024-26 మధ్య పట్టణాల్లో 57 గ్రీన్ స్పేస్ పార్కులు పూర్తి కాగా, మరో 284 గ్రీన్ పార్కులు, 100 స్వచ్ఛాంధ్ర పార్కులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2030 నాటికి గ్రీన్ కవర్ను 37%కి, 2047 నాటికి 50%కి పెంచాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ కల్లా 7.14 లక్షల కిచెన్ గార్డెన్స్, 1 లక్ష సోక్ పిట్స్, 8,000 కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కి.మీ మ్యాజిక్ డ్రెయిన్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే సెప్టెంబర్ కల్లా అన్ని గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రి నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛంగా, పచ్చగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్నాయి.