జర్మనీలోని మ్యూనిక్ మరియు కొలోన్ నగరాలలో తిరుమల వైభవాన్ని ప్రతిబింబిస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మరియు ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) సహకారంతో, తెలుగు అసోసియేషన్ జర్మని ఇ.వి. (TAG) ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారాంతరంలో ఈ దివ్య మహోత్సవం జరిగింది.
టీటీడీ డెప్యుటి.ఇ.ఇ. శ్రీ మల్లయ్య గారి పర్యవేక్షణలో టీటీడీ వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ కృతువును నిర్వహించింది. వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
విదేశీ నేలపై భారతీయ సంస్కృతికి లభించిన ఈ గౌరవం అందరినీ ఆనందభరితులను చేసింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ ఘట్టాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన భక్తులు పులకించిపోయారు.
అర్చకులు తిరుమలలో జరిగే విధంగా కళ్యాణ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తీర్చిదిద్దారు. ప్రాంగణం మొత్తం “గోవిందా… గోవిందా…” నినాదాలతో మారుమోగింది. కళ్యాణ మహోత్సవంతో పాటు వేద పారాయణం, సాంప్రదాయ అలంకరణలతో ఈ వేడుక ఒక ఆధ్యాత్మికంగా సుసంపన్నమైన పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
ఈ పవిత్ర వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ మరియు ఇతర భారతీయ రాష్ట్రాల భక్తులతో పాటు అనేక విదేశీ భక్తులు కూడా పాల్గొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించారు. అనంతరం భక్తులకు టీటీడీ లడ్డు ప్రసాదం మరియు కళ్యాణ ప్రసాదం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ "జర్మనీలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు ఈ కల్యాణోత్సవం ద్వారా ఆధ్యాత్మిక అనుభూతి కలిగించగలగడం మా భాగ్యం. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పండితులు, స్వచ్ఛంద సేవకులు, భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు,” అని పేర్కొన్నారు.
TAG అధ్యక్షులు నరేష్ కోనేరు, జనరల్ సెక్రటరీ సుమంత్ కొర్రపాటి, ట్రెజరర్ డా. శ్రీకాంత్ కుడితిపూడి, మాట్లాడుతూ, “జర్మనీ లో నివసిస్తున్న భక్తులకు తిరుమల వాతావరణాన్ని అందించడం మా అదృష్టం" అని పేర్కొన్నారు.
మ్యూనిక్ లో జరిగిన శ్రీనివాస కళ్యాణానికి శర్మ ఆర్యసోమయాజుల, పవన్ భాస్కర లతో కూడిన శివాలయం బృందం మరియు TAG బవేరియా టీమ్, వెంకట్ కండ్ర, రామ్ బోళ్ళ, శివ నక్కల, బాల అన్నమేటి, శ్రీనివాస్ దామ, విద్యాసాగర్ రెడ్డి, అశోక్ రెడ్డి, రవి పేరిచర్ల బాద్యత తీసుకున్నారు.
కొలోన్ లో జరిగిన కళ్యాణానికి TAG - NRW బృందం కిషోర్ నల్లపాటి, సందీప్ కొర్రపాటి, రవి తేజ కాజా, కృష్ణుడు, సతీష్, శివ బత్తుల, మరియు SVK- NRW సభ్యులు రవి శంకర్, ఆనంద్, వంశీ, సతీష్ రెడ్డి, రామ్, బాద్యత తీసుకున్నారు.
యూరప్ మరియు యు.కె. కళ్యాణాల ప్రధాన కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని, షెంగెన్ ఏరియా కోఆర్డినేటర్లు డాక్టర్ శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, APNRTS చైర్మన్ డాక్టర్ రవి వేమూరి అండ్ టీమ్ ఈ కార్యక్రమం విజయవంతం అవటంలో ప్రధాన పాత్ర పోషించారు.