దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (NITs)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన బీటెక్, బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ జనవరి సెషన్కు సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జనవరి 8న విడుదల చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి తమకు కేటాయించిన పరీక్ష నగరాన్ని తెలుసుకోవచ్చు. ఈ స్లిప్ ద్వారా అభ్యర్థులు ముందుగానే తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది.
అయితే సిటీ ఇంటిమేషన్ స్లిప్లో కేవలం పరీక్ష నగరం వివరాలు మాత్రమే ఉంటాయని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్ష తేదీ, షిఫ్ట్ టైమింగ్, పరీక్ష కేంద్రం అడ్రస్ వంటి పూర్తి వివరాలు ఇందులో పొందుపరచలేదు. ఈ కీలక సమాచారమంతా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్లో మాత్రమే వెల్లడించనున్నారు. అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి కచ్చితంగా నాలుగు రోజుల ముందు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. అందువల్ల అభ్యర్థులు సిటీ స్లిప్తో పాటు అడ్మిట్ కార్డ్ను కూడా తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది.
జేఈఈ మెయిన్ 2026 జనవరి సెషన్ పరీక్షలు జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు మొత్తం ఆరు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్–1 పరీక్షను నిర్వహిస్తారు. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల కోసం పేపర్–2 పరీక్ష ఉంటుంది. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇక పేపర్–2 పరీక్ష జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్ట్లో నిర్వహించనున్నారు.
ఈ ఏడాది జేఈఈ మెయిన్ 2026 జనవరి తొలి సెషన్కు 14.50 లక్షలకు పైగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఇది గత సంవత్సరాలతో పోలిస్తే భారీ సంఖ్యగా అధికారులు చెబుతున్నారు. ఇక జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్లో జరగనున్నాయి. అభ్యర్థులు రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం ఉండగా, అందులో పొందిన బెస్ట్ స్కోర్ను మాత్రమే తుది ర్యాంకింగ్కు పరిగణలోకి తీసుకుంటారు. జేఈఈ మెయిన్లో టాప్ 2.50 లక్షల ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అర్హత లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను పరిశీలించాలని ఎన్టీఏ సూచించింది.