ఉచిత విద్యతో పాటు అద్భుతమైన వసతులు
అడ్మిషన్ పొందడానికి ఉండాల్సిన అర్హతలు
కావలసిన పత్రాలు దరఖాస్తు విధానం
Heal Paradise School Inter Admissions 2026: ఏలూరు జిల్లా తోటపల్లిలోని హీల్ ప్యారడైజ్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యంగా నడుస్తున్న ఈ సంస్థ, అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు.
డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఏర్పాటు చేసిన ఈ హీల్ ప్యారడైజ్ స్కూల్, సుమారు 90 ఎకరాల భారీ ప్రాంగణంలో విస్తరించి ఉంది. ఇక్కడ సీటు పొందిన విద్యార్థులకు చదువు, వసతి, పౌష్టికాహారం పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ముఖ్యంగా తల్లిదండ్రులు లేని పిల్లలు, అనాథలు అత్యంత పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఈ స్కూల్ ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఇక్కడ సీబీఎస్ఈ సిలబస్లో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుంది.
ఇంటర్మీడియట్లో MPC, BiPC, MEC గ్రూపుల్లో చేరాలనుకునే వారు మే18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పదో తరగతిలో మంచి మార్కులు సాధించి ఉండాలి. స్టేట్ బోర్డు విద్యార్థులు కనీసం 480 మార్కులు, సీబీఎస్ఈ లేదా ఐసీఎస్ఈ విద్యార్థులు 400 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. కేవలం మార్కులే కాకుండా, పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్ష ఇంటర్వ్యూలో కూడా ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది.
ఆర్థికంగా వెనుకబడిన వారు మాత్రమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యాజమాన్యం సూచిస్తోంది. దరఖాస్తు సమయంలో తెల్ల రేషన్ కార్డు ఆదాయ ధ్రువీకరణ పత్రం కచ్చితంగా సమర్పించాలి. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్సైట్ www.healschool.co.in ద్వారా లేదా స్కూల్ వారు అందించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
తోటపల్లి క్యాంపస్ కేవలం చదువుకే పరిమితం కాకుండా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఇక్కడ విద్యార్థుల కోసం భారీ లైబ్రరీ, క్రీడలు ఇతర కళలలో శిక్షణ ఇస్తారు. బాలబాలికలకు విడివిడిగా హాస్టల్ వసతి ఉండటంతో పాటు, అత్యవసర వైద్య సేవ కోసం క్యాంపస్ లోపలే ఒక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. దేశంలో ఏ ప్రాంతం వారైనా ఈ పాఠశాలలో చేరడానికి అర్హులు.
దరఖాస్తు చేసుకోవడానికి మే 18 చివరి తేదీగా నిర్ణయించారు. అడ్మిషన్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం healschool.org వెబ్సైట్ను చూడవచ్చు లేదా 9100024438, 9100024435 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు. అర్హత ఉన్న పేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.