స్కూల్, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధార్ కార్డులో బయోమెట్రిక్ వివరాల అప్డేట్ ఇప్పుడు తప్పనిసరి అయింది. చిన్న వయస్సులో తీసుకున్న ఆధార్లో ఉన్న వేలిముద్రలు, కళ్ల ఐరిష్ వివరాలు వయస్సు పెరిగే కొద్దీ మారిపోతాయి. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తప్పనిసరిగా తమ ఆధార్ బయోమెట్రిక్ డేటాను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ అప్డేట్ చేయించకపోతే పాఠశాలలు, కళాశాలల్లో అమలవుతున్న బయోమెట్రిక్ హాజరు విధానంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలు సకాలంలో అప్డేట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ అప్డేట్ కోసం ఇకపై ఆధార్ కేంద్రాలకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. విద్యార్థుల సౌకర్యం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని స్కూల్స్, కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ స్పెషల్ క్యాంపులు జనవరి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను నేరుగా స్కూల్ లేదా కాలేజీకి తీసుకెళ్లి అక్కడే ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయించుకోవచ్చు. అంతేకాదు, ఇప్పటివరకు ఆధార్ కార్డు లేని విద్యార్థులు కూడా ఈ క్యాంపుల్లో కొత్త ఆధార్ కోసం నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రస్తుతం చాలా స్కూల్స్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలులో ఉంది. విద్యార్థుల వేలిముద్రలు లేదా ఐరిష్ వివరాలు సరిపోలకపోతే హాజరు నమోదు కాకపోవడం, స్కాలర్షిప్లు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ఆలస్యం కావడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ సమస్యలను ముందుగానే నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులు పూర్తిగా విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయబడ్డాయని అధికారులు తెలిపారు.
ముఖ్యంగా ఈ స్పెషల్ ఆధార్ క్యాంపుల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు. సాధారణంగా బయట ఆధార్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకుంటే కొంత ఫీజు చెల్లించాల్సి వస్తుంది. కానీ స్కూల్స్, కాలేజీల్లో నిర్వహిస్తున్న ఈ క్యాంపుల్లో విద్యార్థులు ఉచితంగా తమ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోవచ్చు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 5.94 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన 10.57 లక్షల మంది విద్యార్థుల కోసం ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.