కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది. ప్రయాణికులతో నిండిన ప్రైవేట్ బస్సు రోడ్డుపై అదుపు తప్పి బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి భయానక దృశ్యం నెలకొంది. ఈ దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత చూసిన వారు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాక, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆయన స్పందనకు దేశ ప్రజలు అభినందనలు తెలిపారు.
అటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రవాణా శాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ లైసెన్స్, రాత్రివేళల్లో సేఫ్టీ ప్రమాణాలపై పునర్విమర్శ అవసరమని పేర్కొన్నారు.
ఇక ఈ ప్రమాద సమయంలో కొన్ని మానవత్వ దృశ్యాలు కూడా ప్రజలను కదిలించాయి. ప్రమాదాన్ని చూసిన ఒక మహిళ వెంటనే వీడియో తీశి పోలీసులకు సమాచారం అందించడం, రక్షణ చర్యలను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. ఆ వీడియో ఆధారంగా అన్ని విభాగాలు తక్షణమే స్పందించాయి. అలాగే అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి తన కారులో ఆరుగురు క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. ఈ ఇద్దరి ధైర్యసాహసాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ప్రజలు వారికి “హ్యాట్సాఫ్ బ్రదర్, సిస్టర్!” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్ (8), కూతురు మన్విత (6) మృతి చెందారు. అలాగే బస్సు ఢీకొట్టిన పల్సర్ బైక్పై వెళ్తున్న కర్నూలు ప్రజానగర్కు చెందిన శంకర్ కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాదకర దృశ్యాలు చూసిన వారెవరికైనా కంటతడి పెట్టించాయి.
ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమేనని ప్రాథమిక సమాచారం చెబుతోంది. బైక్ను ఢీకొట్టిన వెంటనే బస్సును ఆపకుండా ముందుకి నడిపిన డ్రైవర్ పరిస్థితిని మరింత విషమం చేశాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు చెలరేగిన సమయంలో ఫైర్ సేఫ్టీ పరికరాలు ఉపయోగించకుండా నీటితో మంటలు ఆర్పే ప్రయత్నం చేయడం కూడా పెద్ద తప్పిదమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంటలు అదుపులోకి రాకపోవడంతో డ్రైవర్ అక్కడినుంచి పరారయ్యాడట.
ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, హైడ్రాలిక్ కేబుల్స్ తెగిపోవడంతో బస్సు డోర్ తెరుచుకోలేదు. దాంతో లోపల చిక్కుకున్న చాలా మంది ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ సదుపాయాలపై అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టాలనే ఆవశ్యకత మరోసారి స్పష్టమవుతోంది. ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అత్యంత సీరియస్గా వ్యవహరిస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడం, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం పైన దృష్టి పెట్టారు.