2025లో 1 కోటి పైగా షెంగెన్ వీసాలు మంజూరు..
షెంగెన్ వీసా దరఖాస్తుల్లో చైనా, టర్కీ, భారత్ ముందంజ..
యూరోపియన్ యూనియన్ (EU) మరియు షెంగెన్ ప్రాంతానికి చెందిన కాన్సులేట్లు 2025 సంవత్సరంలో షార్ట్-స్టే వీసాల కోసం దాదాపు 1.2 కోట్ల (12 మిలియన్) దరఖాస్తులు స్వీకరించాయి. ఇది 2024తో పోలిస్తే 1.8% పెరుగుదల (2024లో 11.7 మిలియన్లు) కాగా, 2023తో పోలిస్తే 15.5% పెరుగుదల (2023లో 10.3 మిలియన్లు)గా నమోదైంది. ఈ గణాంకాలను యూరోపియన్ కమిషన్ విడుదల చేసింది.
అయితే, కరోనా మహమ్మారి ముందు ఉన్న 2019 స్థాయిలతో పోలిస్తే ఇంకా డిమాండ్ తక్కువగానే ఉంది. ఆ సమయంలో మొత్తం దరఖాస్తులు 17 మిలియన్ల వరకు నమోదు అయ్యాయి.
వీసా మంజూరు సంఖ్యలు కూడా పెరిగాయి, 2025లో మొత్తం 1 కోట్లకు పైగా (10 మిలియన్లు) షెంగెన్ వీసాలు మంజూరు అయ్యాయి. ఇది 2024తో పోలిస్తే 3% పెరుగుదల (2024లో 9.7 మిలియన్లు). కానీ 2019లో మంజూరు చేసిన 15 మిలియన్లతో పోలిస్తే ఇంకా తక్కువగానే ఉంది.
ప్రపంచవ్యాప్తంగా వీసా తిరస్కరణ రేటు 14.8% వద్ద స్థిరంగా ఉంది. ఇది 2024తో సమానమే. కొన్ని దేశాల్లో మాత్రం తిరస్కరణ రేటులో మార్పులు కనిపించాయి, రష్యా 7.5% నుంచి 6.4%కి తగ్గింది, అల్జీరియా 35% నుంచి 31%కి తగ్గింది, ఎథియోపియా 36.1% నుంచి 34%కి తగ్గింది.
అయితే కొన్ని దేశాల్లో తిరస్కరణలు గణనీయంగా పెరిగాయి, కేప్ వెర్డే లో తిరస్కరణ రేటు 13.4% నుంచి 21.4%కి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 29.9% నుంచి 40.1%కి, సెనెగల్ 46.8% నుంచి 51.9%కి, బురుండీ 40% నుంచి 53.4%కి పెరగడం విశేషం.
2025లో షెంగెన్ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేసిన దేశాలు ఇవే:
చైనా – 1.8 మిలియన్లు
టర్కీ – 1.25 మిలియన్లు
భారత్ – 1.15 మిలియన్లు
రష్యా – 6.79 లక్షలు
మొరాకో – 6.2 లక్షలు
మల్టిపుల్ ఎంట్రీ వీసాలు గణనీయంగా తగ్గాయి. మంజూరు చేసిన వీసాల్లో 51.2% (5.1 మిలియన్లు) మాత్రమే మల్టిపుల్ ఎంట్రీ అనుమతులు కలిగినవి. ఇది 2024లో ఉన్న 52.2%తో పోలిస్తే స్వల్ప తగ్గుదలగా ఉంది. షెంగెన్ దేశాలు 2025లో బయటి సరిహద్దుల వద్ద 83,790 వీసాలను జారీ చేశాయి. ఇది 2024లో ఉన్న 85,118తో పోలిస్తే కొద్దిగా తక్కువ. మొత్తంగా చూస్తే, షెంగెన్ వీసాలపై ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మళ్లీ పెరుగుతున్నప్పటికీ, కరోనా ముందు స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.