భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నుంచి 8 ఏసీ బస్సులు..
ఎయిర్ ట్రావెలర్ల కోసం జాతీయ రహదారిపై ఏసీ లాంజ్లు..
విశాఖపట్నం నగరానికి సమీపంలో నిర్మాణం పూర్తిచేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. జూలై తొలి వారంలో విమానాశ్రయాన్ని ప్రారంభించి, రెండో వారంలో విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉండటంతో, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖ నగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రత్యేక ఏసీ బస్సులు నడపాలని నిర్ణయించారు.
జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్, జివిఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు, జివిఎంసీ సిటీ ప్లానర్ ధనుంజయ్ రెడ్డి తదితర అధికారులు కలిసి మార్గాలపై ప్రత్యేక సర్వే నిర్వహించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు నగరం నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్య, అవసరాలను అంచనా వేసి రవాణా ప్రణాళికను రూపొందించారు.
ఈ ప్రణాళికలో భాగంగా కుర్మన్నపాలెం నుంచి భోగాపురం వరకు ఎనిమిది ఎయిర్ కండిషన్డ్ బస్సులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ బస్సులు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండనున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భోగాపురం విమానాశ్రయం వద్ద తాత్కాలికంగా ప్రత్యేక చార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
అలాగే విమాన ప్రయాణికులు వేచి ఉండేందుకు జాతీయ రహదారి-16 వెంట పలు ప్రాంతాల్లో ఆధునిక ఏసీ లాంజ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కుర్మన్నపాలెం, గాజువాక, ఎన్ఏడీ, మద్దిలపాలెం, మధురవాడ, తగరపువలస ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. ఈ లాంజ్లలో ప్రయాణికులకు విశ్రాంతి, సమాచారం, బస్సు సౌకర్యాలపై మార్గదర్శక సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జూన్ నెలాఖరులోపు ఈ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకోనున్నాయి. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీ పెరిగితే మరిన్ని బస్సులు, కొత్త రూట్లను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో విశాఖ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం పెరగనుండగా, ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణ సేవలు అందించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం విశేషంగా మారింది.