అమెరికా ప్రభుత్వ సైబర్ భద్రత వ్యవస్థలో సంచలనం రేపిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన ఒక ఉన్నతాధికారి, ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైన ఫైళ్లను ప్రజలకు అందుబాటులో ఉన్న చాట్జీపీటీ ప్లాట్ఫారంలో అప్లోడ్ చేసినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం అమెరికాలో పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ ఘటనలో ఉన్న వ్యక్తి పేరు డాక్టర్ మధు గొట్టుముక్కల. ప్రస్తుతం ఆయన అమెరికా సైబర్సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ కు తాత్కాలిక డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ అనేది అమెరికా ప్రభుత్వ రహస్య నెట్వర్క్లు, కీలక సదుపాయాలను విదేశీ హ్యాకర్ల నుంచి రక్షించే అత్యంత కీలక సంస్థ. అలాంటి సంస్థను నడిపిస్తున్న వ్యక్తే ఈ తరహా తప్పిదానికి పాల్పడ్డాడన్న వార్త తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
నివేదికల ప్రకారం మధు గొట్టుముక్కల తన పదవిలోకి వచ్చిన కొద్ది రోజులకే కొన్ని ప్రభుత్వ కాంట్రాక్టింగ్ పత్రాలను చాట్జీపీటీ పబ్లిక్ వెర్షన్లో అప్లోడ్ చేశారని తెలుస్తోంది. ఈ ఫైళ్లు గోప్యమైనవిగా వర్గీకరించబడకపోయినా ఫర్ ఆఫిషియల్ యూజ్ ఓన్లీ గా గుర్తించబడిన సున్నిత సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్య వల్ల అమెరికా ప్రభుత్వ సైబర్ భద్రత వ్యవస్థలో ఆటోమేటెడ్ అలర్ట్స్ పలుమార్లు యాక్టివ్ అయ్యాయని సమాచారం.
ఆ సమయంలో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్కు చెందిన ఇతర ఉద్యోగులకు చాట్జీపీటీ వాడకం నిషేధించబడినప్పటికీ ప్రత్యేక అనుమతి తీసుకొని మధు గొట్టుముక్కల ఈ ఏఐ టూల్ను ఉపయోగించినట్టు నివేదికలు వెల్లడించాయి. ఆ అనుమతిని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అంశంపై అంతర్గత విచారణ కూడా ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఆ విచారణ తుది ఫలితాలు ఇంకా వెల్లడికాలేదు.
సీసా పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ ఒక ప్రకటనలో స్పందిస్తూ మధు గొట్టుముక్కలకు పరిమిత కాలానికి, ప్రత్యేక నియంత్రణలతో చాట్జీపీటీ వాడేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అమెరికా ప్రభుత్వాన్ని ఆధునికీకరించేందుకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్న ట్రంప్ ఆదేశాల్లో భాగంగానే ఈ అనుమతి ఇచ్చినట్టు పేర్కొన్నారు. అయితే భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని కూడా స్పష్టం చేశారు.
భారతదేశానికి చెందిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ చదివిన మధు గొట్టుముక్కల, ఐటీ రంగంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగి ఉన్నారు. ఆయన విద్యా నేపథ్యం అనుభవం చూస్తే ఈ తరహా తప్పిదం జరగడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఘటనతో ప్రభుత్వ సంస్థల్లో ఏఐ వినియోగంపై మరింత కఠిన నియమాలు అవసరమన్న చర్చ అమెరికాలో మళ్లీ తెరపైకి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది