గోదావరిలోకి చుక్క మురుగు నీరు కూడా చేరకూడదు: పవన్ కళ్యాణ్..
268 పంచాయతీలను మోడల్ పుష్కర్ గ్రామాలుగా తీర్చిదిద్దనున్న ప్రభుత్వం..
అమరావతి: రానున్న గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, కాలుష్యరహితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. గోదావరి తీరంలోని 268 గ్రామ పంచాయతీలను జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
శనివారం గోదావరి పుష్కరాలకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగు నీరు చుక్క కూడా గోదావరి నదిలో కలవకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, జిల్లా కలెక్టర్లు దీనిని బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
పుష్కరాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. పుష్కర ఘాట్లు, పుష్కర నగరాల్లో పార్కింగ్, వీధి దీపాలు, దుస్తులు మార్చుకునే గదులు, జల్లు స్నానాల సదుపాయాలు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఆలయాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్ల సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయాలని, అవసరమైతే వాటి వెడల్పును పెంచుకునే అవకాశం కూడా కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా గోదావరిలోకి మురుగు నీరు చేరకుండా మ్యాజిక్ డ్రెయిన్లను విస్తృతంగా వినియోగించాలని ఆదేశించారు. ఈ డ్రెయిన్లు పంచాయతీల్లో మురుగు నీటి సమస్యను తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇస్తున్న గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, మురుగు నీటి నిర్వహణ పనుల కోసం అవసరమైన వ్యయాలు, పనుల వివరాలతో కూడిన సమగ్ర ప్రణాళికను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ప్రధాన ఘాట్ల వద్ద గోదావరి హారతి కార్యక్రమాల నిర్వహణకు దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుని ఆలయాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
సీతానగరం సమీపంలోని మునికూడలి ఘాట్ను దేశంలోనే ఆదర్శవంతమైన పుష్కర ఘాట్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఘాట్కు "సప్తర్షి పుష్కర్ ఘాట్"గా నామకరణం చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 80 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఘాట్లో ఒకేసారి 75 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసే అవకాశం ఉందని చెప్పారు. భక్తుల కోసం అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పార్కింగ్ అవసరాల కోసం రైతుల భూములను వినియోగిస్తే వారికి పార్కింగ్ ఫీజులో వాటా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల అనుమతితో, వారి సహకారంతోనే అన్ని ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. మునికూడలి ఘాట్ సమీపంలో ఉన్న సోమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నెలలో జరిగే కేబినెట్ సమావేశం అనంతరం తాను స్వయంగా మునికూడలి ఘాట్ను సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలిస్తానని తెలిపారు.
సమష్టిగా కృషి చేసి గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్డీ వెంకటకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.