Politics- టీడీపీ రాజ్యసభ బరిలో ఎవరు నిలుస్తారు….
రెండు సీట్లకు ఫైనల్ టచ్, మూడో సీటుకు ఇద్దరి పేర్లు పరిశీలనలో!
సామాజిక సమీకరణాలపై చంద్రబాబు కసరత్తు.. నేడే రాజ్యసభ తుది జాబితా…
Rajya Sabha: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేపుతున్న రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య ఇప్పటికే స్పష్టమైన అవగాహన కుదిరింది. అధికారిక ఒప్పందం ప్రకారం ఈ నాలుగు సీట్లలో మూడింటిని తెలుగుదేశం పార్టీ దక్కించుకోగా, మిగిలిన ఒక స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ కోటా సీటుకు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును అధికారికంగా ఖరారు చేయడంతో, అందరి దృష్టి ఇప్పుడు టీడీపీ ప్రకటించబోయే ముగ్గురు అభ్యర్థులపైనే పడింది.
మిగిలిన మూడు స్థానాల కోసం అభ్యర్థులను ఖరారు చేసే పనిలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి ఉన్న నమ్మకమైన కేడర్, అలాగే గతంలో ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ముగ్గురు అభ్యర్థులలో ఇద్దరి పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారైపోగా, మూడో స్థానం కోసం మాత్రం ఇద్దరు కీలక నేతల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఈ ముగ్గురు అభ్యర్థుల వివరాలను ఈరోజే అధికారికంగా వెల్లడించేందుకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ రేసులో మొదటి స్థానంలో ప్రముఖ విద్యావేత్త, భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు వినిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని ఆశించినప్పటికీ, కూటమి సమీకరణాల వల్ల అది సాధ్యపడలేదు. ఆ సమయంలోనే చంద్రబాబు నాయుడు ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ భాష్యం రామకృష్ణకు మొదటి ప్రాధాన్యత సీటును కేటాయించినట్లు సమాచారం. విద్యా రంగంలో ఆయనకున్న అనుభవం, సమాజంలో ఉన్న గుర్తింపు కూడా ఈ ఎంపికకు ప్లస్ పాయింట్లుగా మారాయి.
ఇక రెండో స్థానానికి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పేరు దాదాపు ఖాయమైంది. గతంలో జరిగిన ఉప ఎన్నిక ద్వారా రాజ్యసభకు ఎన్నికైన సతీష్ బాబు పదవీకాలం ఈ నెల 21వ తేదీతో ముగియనుంది. ఆయన కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే ఎంపీగా కొనసాగడంతో, ఆయనకు పూర్తి స్థాయి పదవీకాలాన్ని అందించేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. పార్టీకి అన్ని విధాలా అండగా నిలిచిన సతీష్ బాబు సేవలను గుర్తించి, ఆయన సీటును చంద్రబాబు నాయుడు మళ్లీ రెన్యువల్ చేయబోతున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అయితే మూడో స్థానం ఎంపికపైనే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సీటును ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి కేటాయించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. ఒకవేళ ఎస్సీ కోటాలో సీటు ఇవ్వాలని భావిస్తే, పార్టీకి అత్యంత నమ్మకస్తుడు, సీనియర్ నేత అయిన వర్ల రామయ్య పేరు దాదాపు ఖరారవుతుంది. అలాకాకుండా బీసీ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటే, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరును పరిశీలనలోకి తీసుకోనున్నారు. ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే అంశంపై ఈరోజు సాయంత్రంలోగా పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.