అద్దంకిలో 28 రూఫ్టాప్ సోలార్ యూనిట్ల ప్రారంభం..
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ యూనిట్లు.. మంత్రి రవికుమార్..
అద్దంకి: విద్యుత్ అవసరాలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రజలు విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు స్వయం విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కలుగుతోందని తెలిపారు.
శనివారం అద్దంకి నియోజకవర్గంలోని జే. పంగలూరు మండలంలో పర్యటించిన మంత్రి, అరికట్లవారిపాలెం గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన 28 రూఫ్టాప్ సోలార్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి సోలార్ యూనిట్ల పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కుటుంబాలపై పడే విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వినియోగదారులకు రెండు కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందిస్తోందని తెలిపారు. రెండు కిలోవాట్ల యూనిట్ ద్వారా నెలకు సుమారు 240 యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారని చెప్పారు.
పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని మరింత ప్రోత్సహించేందుకు బీసీ, ఓసీ వర్గాల వినియోగదారులకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలు అందిస్తోందని మంత్రి వెల్లడించారు. మూడు కిలోవాట్ల సోలార్ యూనిట్కు బీసీ వర్గాలకు రూ.98 వేల వరకు, ఓసీ వర్గాలకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందజేస్తున్నట్లు తెలిపారు.
రూఫ్టాప్ సోలార్ యూనిట్ల ఏర్పాటు సమయంలో కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనాలు అందేలా పనుల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
సోలార్ యూనిట్ల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి గొట్టిపాటి జే. పంగలూరు మండలంలోని చందలూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ చందలూరు-గంగవరం గ్రామాల మధ్య రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.
అనంతరం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.