ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా మారుతోంది: మంత్రి సవిత..
సేంద్రీయ సాగుతో రైతులకు అధిక లాభాలు: మంత్రి సవిత..
తాడేపల్లి: సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. ప్రస్తుతం సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు కూడా అధిక ఆదాయం లభిస్తోందని పేర్కొన్నారు.
శనివారం తాడేపల్లిలోని ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి సవిత అక్కడ సాగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం ప్రజా ఉద్యమంగా మారుతోందని, రసాయన ఎరువులు, పురుగుల మందులు లేకుండా సాగు చేసే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
రసాయన ఎరువుల వినియోగం వల్ల దిగుబడులు పెరిగినా, దీర్ఘకాలంలో క్యాన్సర్తో పాటు పలు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అందుకే ప్రజలు సేంద్రీయ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతి ఒక్కరూ సేంద్రీయ ఆహార పదార్థాలను వినియోగించాలని సూచించారు.
సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతులను, ఎఎస్సార్ వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి లాభాలు పొందుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేలా మంత్రి సవిత తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రానికి సైకిల్పై వెళ్లారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ క్షేత్రంలో పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు.
సేంద్రీయ ఎరువుల తయారీ విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని సందర్శించి వివిధ ఉత్పత్తుల ధరలను తెలుసుకున్నారు. కొన్ని ఉత్పత్తులను స్వయంగా కొనుగోలు చేశారు. క్షేత్రంలో పండించిన జామపండును రుచి చూసి రైతుల కృషిని అభినందించారు.
తిరుగు ప్రయాణంలో కూడా సైకిల్నే ఉపయోగించిన మంత్రి, మార్గమధ్యంలో పాతూరు రోడ్డులో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద ఆగి మజ్జిగ తాగారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి, ఎఎస్సార్ సేంద్రీయ వ్యవసాయ క్షేత్రం నిర్వాహకుడు సామిరెడ్డి, కూటమి నాయకులు రాజశేఖర్, కొమ్మారెడ్డి కిరణ్, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, సేంద్రీయ ఉత్పత్తుల వినియోగాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి సవిత ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.