తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణే లక్ష్యం: దుర్గేష్..
ఎక్కడున్నా మూలాలు మరవొద్దు.. మాతృభాషను కాపాడాలి: మంత్రి దుర్గేష్..
ముంబయి: తెలుగు భాష, సంస్కృతిని భావితరాలకు అందించడం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముంబయిలో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా "తెలుగు భవనం" ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
మూడు రోజుల కేరళ పర్యటన అనంతరం ముంబయి చేరుకున్న మంత్రి దుర్గేష్, ముంబయి ఆంధ్ర మహాసభ మరియు జింఖానా సంయుక్తంగా నిర్వహించిన "తెలుగు సాంస్కృతిక సంబరాలు-2026" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, కార్యవర్గ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
ముంబయిలోని సియాన్ ప్రాంతంలో ఉన్న శ్రీ షణ్ముఖానంద చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆడిటోరియంలో జరిగిన సభలో మాట్లాడిన మంత్రి, తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. పరాయి ప్రాంతాల్లో స్థిరపడినా తమ భాష, యాస, సంప్రదాయాలను కాపాడుకుంటూ తదుపరి తరాలకు అందిస్తున్న ముంబయి తెలుగు సంఘాల సేవలను ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా నిడదవోలుకు చెందిన చిన్నారి నదియ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే మహారాష్ట్ర ప్రత్యేక గీతానికి తెలుగు ప్రాంతానికి చెందిన చిన్నారులు ప్రదర్శించిన నృత్య రూపకం స్థానిక సంస్కృతి, తెలుగు సంప్రదాయాల సమన్వయానికి మంచి ఉదాహరణగా నిలిచిందన్నారు.
ఎక్కడ ఉన్నా మన మూలాలను, సంస్కృతిని మరవకూడదని మంత్రి సూచించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా ఒకే కుటుంబానికి చెందిన వారేనని చెప్పారు. తెలుగువారిలో ఐకమత్యం లేదనే భావనను తొలగించి, భాషాపరంగా మనమంతా ఒక్కటేనని చాటిచెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత తరం పిల్లలకు తెలుగు భాషను నేర్పించడం అత్యంత అవసరమని పేర్కొన్న ఆయన, హిందీ, ఇంగ్లీష్ భాషలతో పాటు మాతృభాషను కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలని సూచించారు. తెలుగు రాయడం, చదవడం, మాట్లాడటం చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలని చెప్పారు. ఈ దిశగా ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక స్థాయిలో తెలుగు మాధ్యమ బోధనను కూటమి ప్రభుత్వం నిబంధనగా తీసుకువచ్చిందని గుర్తు చేశారు.
ప్రపంచంలో పద్యనాటక ప్రక్రియ ఇప్పటికీ సజీవంగా ఉన్న భాష తెలుగు మాత్రమేనని మంత్రి దుర్గేష్ అన్నారు. అలాంటి గొప్ప సాహిత్య సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
ముంబయిలో తెలుగు రాష్ట్రాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక "తెలుగు భవనం" ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. ఆ భవనంలో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య సభలు, కళా ప్రదర్శనలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. అలాగే ముంబయిలోని తెలుగు ఆడిటోరియం అభివృద్ధికి, ముంబయి ఆంధ్ర మహాసభ చేపట్టే సాంస్కృతిక కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ముంబయి ఆంధ్ర మహాసభ, జింఖానా అధ్యక్షుడు కొండారెడ్డి మరియు వారి కార్యవర్గ సభ్యులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్, ముంబయి ఆంధ్ర మహాసభ, జింఖానా ప్రతినిధులు, స్థానిక తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.