- 11 సీట్లు వచ్చినా మారని నైజం: కుట్రలు, కుతంత్రాలకు వైసీపీయే కేరాఫ్ అడ్రస్!
- కల్తీపాలకు చెక్.. గంటల్లోనే యాక్షన్: బాధితులకు అండగా నిలిచిన చంద్రబాబు ప్రభుత్వం!
Sujatha fires on YSRCP jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి, ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ ఛైర్మన్ పీతల సుజాత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా, జగన్మోహన్ రెడ్డి గారిలో గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలలో గానీ మార్పు రాలేదని ఆమె విమర్శించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. చట్టసభలకు వచ్చి ప్రజల పక్షాన నిలబడే ధైర్యం లేని వైసీపీ నేతలు, బయట కూర్చుని దేవాలయాలపై, కల్తీ నెయ్యిపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటు. ప్రజారోగ్యం విషయంలో కూడా తమ పత్రికల్లో తప్పుడు వార్తలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్ గారూ.. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం వింత వ్యాధులకు నిలయంగా మారింది.
ఏలూరులో వాటర్ కంటామినేషన్ వల్ల వందలాది మంది ఆసుపత్రి పాలైతే మీరు తీసుకున్న చర్యలేమిటి? జంగారెడ్డిగూడెంలో మీ వారు అమ్మిన కల్తీ సారా తాగి 25 మంది ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలను పరామర్శించారా? మీ పాలనలో నంద్యాల, రామతీర్థం, కాకినాడ వంటి ప్రాంతాల్లో అతిసారం ప్రబలి జనం పిట్టల్లా రాలిపోయారు. రాజమండ్రిలో అప్పటి ఎంపీ భరత్ గారిని ప్రజలు నిలదీసి, "చీరలు వద్దు.. తాగడానికి మంచి నీళ్లు ఇవ్వండి మహాప్రభూ" అని వేడుకున్న పరిస్థితిని రాష్ట్రం మర్చిపోలేదు. ఆదివాసీ గ్రామాల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ప్రజలు అల్లాడిపోతుంటే మీరు తాడేపల్లి ప్యాలెస్లో మొద్దు నిద్ర పోయారు తప్ప, ఏనాడైనా బాధితులకు ధైర్యం చెప్పారా? జగన్ మోహన్ రెడ్డి గారూ.. మీ సాక్షి పత్రికలో, ఛానల్లో అబద్ధాలు రాసేస్తే జనం నమ్మేస్తారనుకుంటున్నారా? మీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన పాపం మీదని విమర్శించారు.
జగన్ గారూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్ల వేళ్లను ఎలుకలు కొరికేస్తుంటే, రక్తం ఓడుతున్న శరీరాలతో రోగులు భయంతో పారిపోయిన దారుణాలను ఈ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదు. సంక్షేమ హాస్టళ్లలో పాములు, ఎలుకల మధ్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడిపిన రోజులు మీ పాలనలో లేవా? మీ టైంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లిన పాపాన పోలేదు. కోవిడ్ వస్తే "పారాసిటమాల్ వేసుకోండి" అని వెటకారంగా మాట్లాడి లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటమాడారు. లక్ష మంది చనిపోతే తప్పుడు లెక్కలతో కప్పిపుచ్చారు. ఆఖరికి ఆసుపత్రుల్లో కరెంట్ లేక టార్చ్ లైట్ల వెలుగులో ఆపరేషన్లు చేసిన ఘనత మీది కాదా? అరబిందో వంటి అనుభవం లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టి 108 వ్యవస్థను భ్రష్టు పట్టించారు. గంటల తరబడి అంబులెన్స్ రాక 'గోల్డెన్ అవర్'లో ప్రాణాలు కోల్పోయిన వేలాది మందికి మీరేం సమాధానం చెబుతారు? అంబులెన్స్లు పాడైపోయి మూలన పడితే పట్టించుకోని మీరు, ఈరోజు మా ప్రభుత్వంపై అబద్ధాలు రాస్తారా?
దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఈరోజు జగన్ గారు మాట్లాడటం హాస్యాస్పదం. మా కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ముఖ్యమంత్రి గారు సమీక్షలు నిర్వహించి, మంత్రులను, అధికారులను క్షేత్రస్థాయికి పంపిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటూ, తక్షణ సాయం అందిస్తూ ప్రజల్లో భరోసా కల్పిస్తున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 190 కొత్త అంబులెన్స్లను అందుబాటులోకి తెచ్చాం. ఫోన్ చేసిన వెంటనే పట్టణాల్లో 18 నిమిషాలు, గ్రామాల్లో 23 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకునేలా చర్యలు తీసుకున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. గతంలో 104 వాహనాల్లో కేవలం షుగర్, బీపీ పరీక్షలు మాత్రమే చేసేవారు. కానీ నేడు దేశంలోనే మొదటిసారిగా 47 రకాల డయాగ్నోస్టిక్ పరీక్షలను నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి చేస్తున్నాం. సిబిసి (CBC), లివర్ టెస్టులు, లిపిడ్ ప్రొఫైల్, కిడ్నీ పరీక్షలు (RFT) వంటి 20 సాధారణ పరీక్షలతో పాటు మరో 27 ప్రత్యేక పరీక్షలను గ్రామాల్లోనే నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని డిజిటలైజ్ చేసి, భవిష్యత్తులో వచ్చే వ్యాధులను అంచనా వేసేలా అత్యాధునిక విధానాన్ని ప్రవేశపెట్టాం.
జగన్ మోహన్ రెడ్డి గారూ.. మీ హయాంలో రాష్ట్రాన్ని 'అనారోగ్య ఆంధ్రప్రదేశ్'గా మార్చి వెళ్లారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారి సారధ్యంలోని కూటమి ప్రభుత్వం, రాష్ట్రాన్ని 'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్'గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది అన్నారు. కల్తీపాల ఘటన వెలుగులోకి వచ్చిన గంటల్లోనే మా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బాధితులను వెంటనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తరలించి, వారికి అవసరమైన వెయ్యి రకాల టెస్టులు, డయాలసిస్, ఆఖరికి వెంటిలేటర్ సాయం కూడా ప్రభుత్వ ఖర్చులతోనే అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా డైరీలపై ఆకస్మిక తనిఖీలు చేయించి, కల్తీకి పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నాం.
బాధితులకు తక్షణ ఆర్థిక సాయం కూడా ప్రకటించాం. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలినప్పుడు మంత్రి నారాయణ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు. నిర్లక్ష్యం వహించిన మున్సిపల్ కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేశాం. 50 మెడికల్ టీములతో ఇంటింటా సర్వే చేయించి, మృతి చెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాం. ఇది మా ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ప్రజారోగ్య పరిరక్షణే మా కూటమి ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా మా మంత్రులు, అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తారు. ప్రజలకు రక్షణగా ఉండటంలో మా ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని పీతల సుజాత స్పష్టం చేశారు.