నిషేధిత జంతువుల వధ చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు..
అక్రమ పశువుల రవాణాపై ఏపీ ప్రభుత్వం సీరియస్..
బక్రీదు పండుగ నేపథ్యంలో రాష్ట్రంలో జంతువుల వధ, రవాణా, సంరక్షణ విషయంలో చట్టాలను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. జంతు హింసకు పాల్పడినా, నిషేధిత జంతువులను వధించినా కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
అమరావతిలో మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా జంతువుల రవాణా, సంరక్షణ, వధకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు అమలులో ఉన్నాయని తెలిపారు. ఇవి జాతీయ స్థాయిలో రూపొందించినప్పటికీ, ప్రతి రాష్ట్రంలో అమలు విధానం, అనుమతులు, నిషేధాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో మాంసాహార అవసరాల కోసం మేకలు, గొర్రెలు, పందులు, కోళ్లు, బాతులు, చేపలు మరియు పునరుత్పత్తికి ఉపయోగించని గేదెలను మాత్రమే వధించేందుకు అనుమతి ఉందని వివరించారు. అయితే ఆవులు, దూడలు, ఒంటెల వధను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు.
పశువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించే సమయంలో జంతు సంరక్షణ చట్టాలకు అనుగుణంగా వాటికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. వాహనాల్లో పరిమితికి మించి పశువులను తరలించడం, నిషేధిత జంతువులను వధించడం వంటి చర్యలు పూర్తిగా చట్టవిరుద్ధమని హెచ్చరించారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఆవులు, దూడలు, ఒంటెలను వధించినా లేదా అక్రమంగా రవాణా చేసినా జంతు హింస నివారణ చట్టం, ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు పశుసంరక్షణ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బక్రీదు సందర్భంగా క్షేత్రస్థాయిలో పశువైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయం చేసుకుని అనధికార పశువుల వధను అరికట్టాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
జంతు సంరక్షణ, గోవధ నిషేధ చట్టాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సమీప పోలీస్ అధికారులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.