బీసీలకు అసలైన స్వాతంత్ర్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీయే..
మహానాడులో బీసీ సంక్షేమ తీర్మానాన్ని బలపర్చిన మంత్రి కొల్లు రవీంద్ర..
అమరావతి వేదికగా జరిగిన మహానాడులో బీసీ సంక్షేమంపై మరోసారి తెలుగుదేశం పార్టీ తన కట్టుబాటును స్పష్టంగా ప్రకటించింది. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బీసీల అభివృద్ధి, ఆత్మగౌరవం, రాజకీయ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీనే నిజమైన అండగా నిలిచిందన్నారు. మహానాడు వేదిక రాజకీయ విమర్శల కోసం కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మహోన్నత వేదిక అని పేర్కొన్నారు.
బీసీలను ఒకప్పుడు “బ్యాక్వర్డ్ క్లాసెస్”గా పిలుస్తూ అణగదొక్కిన పరిస్థితుల్లో, ఎన్టీఆర్ వారిని “బ్యాక్బోన్ క్లాసెస్”గా గుర్తించి గౌరవం కల్పించారని మంత్రి గుర్తుచేశారు. కరణం, మున్సబు, పటేల్-పట్వారీ వంటి వ్యవస్థలను రద్దు చేసి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించి గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ వరకు నాయకత్వ అవకాశాలు కల్పించారని తెలిపారు.
అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కింజరాపు ఎర్రన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి వంటి బీసీ నాయకులను టీడీపీ తీర్చిదిద్దిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనూ కీలక శాఖలను బీసీ నేతలకు అప్పగించడం ద్వారా చంద్రబాబు బీసీలపై ఉన్న విశ్వాసాన్ని చూపించారని అన్నారు. వ్యవసాయం, రెవెన్యూ, వైద్యారోగ్యం, గృహ నిర్మాణం, మైన్స్, ఎక్సైజ్ వంటి ప్రధాన శాఖలను బీసీ మంత్రులకు అప్పగించడం ప్రత్యేకమన్నారు.
చంద్రబాబు నాయకత్వంలో బీసీల విద్యా, ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేశామని మంత్రి వివరించారు. రెసిడెన్షియల్ స్కూల్స్, స్టడీ సర్కిల్స్, విదేశీ విద్య పథకాలు, విద్యోన్నతి వంటి కార్యక్రమాలు బీసీ యువత భవిష్యత్తును మార్చాయని అన్నారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచడం, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయాలని పేర్కొన్నారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీలపై దాడులు, తప్పుడు కేసులు, అణచివేతలు పెరిగాయని కొల్లు రవీంద్ర ఆరోపించారు. ప్రశ్నించిన బీసీ నాయకులపై కేసులు పెట్టారని, కొంతమందిపై దాడులు జరిగాయని అన్నారు. తాను కూడా తప్పుడు కేసుతో 54 రోజులు జైలులో ఉండాల్సి వచ్చిందని గుర్తుచేశారు.
యువగళం పాదయాత్ర బీసీల్లో కొత్త భరోసా నింపిందని, నారా లోకేష్ ప్రకటించిన బీసీ రక్షణ చట్టం హామీతో బీసీలకు ధైర్యం వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలుకు చర్యలు చేపట్టామని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో 34 శాతం బీసీలకు అవకాశం కల్పించామని, కల్లుగీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం వాటా ఇచ్చామని తెలిపారు.
వడ్డెర్లకు క్వారీల్లో 15 శాతం వాటా, సీనరేజీలో 50 శాతం సబ్సిడీ ప్రకటించామని చెప్పారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఆదరణ పథకాన్ని రూ.1000 కోట్లతో మళ్లీ ప్రారంభించామని అన్నారు. నాయీ బ్రాహ్మణులు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు.
మత్స్యకారుల కోసం జీవో నంబర్ 217 రద్దు చేసి వేట నిషేధ భృతి అందిస్తున్నామని, రూ.220 కోట్లతో 200 మెకనైజ్డ్ బోట్లను అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ పార్కులు, సొసైటీల ద్వారా రుణాల సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. బీసీల కోసం పోరాడటం తనకు గర్వకారణమని, తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బీసీలకు అండగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.