AP IT News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా మార్చే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ 'క్యాప్ జెమినీ' సీఈవో ఐమాన్ ఇజ్జత్తో ఆయన కీలక భేటీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ లో భాగంగా విశాఖలో ఐటీ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అపారమైన అవకాశాలను ఈ సందర్భంగా లోకేష్ వివరించారు. ఇప్పటికే గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖలో అడుగుపెట్టాయని, త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ అద్భుతమైన ఎకో సిస్టమ్ ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
విశాఖలో దాదాపు 20 వేల మందికి ఉపాధి కల్పించేలా ఒక భారీ డెవలప్మెంట్ సెంటర్తో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు చేయాలని క్యాప్ జెమినీ సంస్థను లోకేష్ కోరారు. కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా క్లౌడ్ సర్వీసెస్, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) వంటి విభాగాలను కూడా ఇక్కడ ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలను ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.
సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ డిజిటల్ టాలెంట్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని లోకేష్ సూచించారు. రాష్ట్రంలో 'క్వాంటం వ్యాలీ' అభివృద్ధికి క్యాప్ జెమినీ సహకారం అందించాలని, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆప్టిమైజేషన్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు తీసుకురావాలని కోరారు. తద్వారా ఏపీ విద్యార్థులకు ప్రపంచస్థాయి టెక్నాలజీపై పట్టు వస్తుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ భేటీలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ మాట్లాడుతూ తమ సంస్థ కార్యకలాపాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకున్న 3.4 లక్షల మంది ఉద్యోగుల్లో సుమారు 2 లక్షల మంది భారత్లోనే ఉండటం విశేషమని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని 13 ప్రధాన నగరాల నుంచి సేవలు అందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. క్లౌడ్, డేటా డిజిటల్ ఇంజనీరింగ్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను తమ బృందం పరిశీలిస్తుందని చెప్పారు.
సుమారు 24 బిలియన్ డాలర్ల వార్షికాదాయం కలిగిన క్యాప్ జెమినీ వంటి సంస్థ విశాఖకు రావడం వల్ల ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కీలక సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకేతో పాటు డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ కూడా పాల్గొని చర్చల్లో భాగస్వాములయ్యారు. ఐటీ రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలబెట్టాలన్న పట్టుదలతో మంత్రి లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నాలు పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.