ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయి?
భూకేటాయింపుల కేసులో కోర్టు ఆదేశం…
పారిశ్రామిక వేత్తలకు హైకోర్టు భరోసా…
AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పారిశ్రామికాభివృద్ధి మరియు పెట్టుబడుల విషయంలో అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ఆయన వాదనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరిశ్రమలకు ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ ఎంపీ పిటిషన్ వేయగా, దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు అనవసరంగా జోక్యం చేసుకోబోవని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది.
పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ బాధ్యతను కోర్టు గుర్తుచేసింది. నేడు ప్రపంచ దేశాల మధ్య, పొరుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం తీవ్రమైన పోటీ నెలకొందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి తరుణంలో కంపెనీలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏ సంస్థ కూడా రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపదని పేర్కొంది. మార్కెట్ ధరకే భూములు ఇస్తామంటే కంపెనీలు దండం పెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోతాయని, పారిశ్రామికీకరణ జరగాలంటే రాయితీలు ఇవ్వడం తప్పనిసరి అని కోర్టు అభిప్రాయపడింది.
ఐటీ రంగంపై తెలుగు వారి ముద్రను కోర్టు ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో అత్యధిక శాతం తెలుగు వారు ఉండటం గర్వకారణమని, ఏపీని ఐటీ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని తక్కువ చేయలేమని చెప్పింది. ఐటీ హబ్ల వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని వివరించింది. ప్రభుత్వ యంత్రాంగం అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను అడ్డుకోవడానికి తాము ఇక్కడ లేమని హైకోర్టు గట్టిగా చెప్పింది.
పిటిషన్ వేసిన తీరును కూడా కోర్టు తప్పుపట్టింది. కేవలం ప్రచారం కోసం లేదా రాజకీయ కారణాలతో పిల్స్ (PILs) వేయడం సరైనది కాదని మండిపడింది. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి పిటిషన్లు ఉండకూడదని హితవు పలికింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారని, వాటిని వ్యతిరేకించడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని పేర్కొంది. అభివృద్ధి పథంలో అడ్డంకులు సృష్టించే చర్యలను తాము ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది.