- "దేశ రక్షణ సంస్థను తరిమేస్తారా?": సాగర్ డిఫెన్స్పై జగన్ వ్యాఖ్యలను దుయ్యబట్టిన రవీంద్ర..
- Politics: "మెరైన్ గస్తీని గాలికొదిలేసింది మీరే": గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన మంత్రి..
Kollu Ravindra: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రాజకీయ ప్రస్థానమే ఒక అరాచకమని, ఆయనకు అభివృద్ధి చేయడం తెలియక కేవలం 'గొడ్డలి రాజకీయాలు' మాత్రమే తెలుసని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి వేగవంతం అవుతుంటే చూసి ఓర్వలేక, కులాల మధ్య చిచ్చుపెట్టి అల్లర్లు సృష్టించేందుకు జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణాన్ని గత ఐదేళ్ల కాలంలో నిధులు ఇవ్వకుండా అడ్డుకుని మత్స్యకారుల పొట్టకొట్టింది జగన్ కాదా అని నిలదీశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జెట్టీలు, కోల్డ్ స్టోరేజ్లతో హార్బర్ను ఆధునికీకరిస్తుంటే, తప్పుడు ప్రచారంతో ప్రజలను రెచ్చగొట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
దేశ రక్షణ రంగానికి సంబంధించిన 'సాగర్ డిఫెన్స్' సంస్థ ఏర్పాటును అడ్డుకుంటానని జగన్ అనడం ఆయన దేశద్రోహ ఆలోచనలకు నిదర్శనమని మంత్రి విమర్శించారు. సొంత కుటుంబ సభ్యులనే దూరం పెట్టిన జగన్, ఇప్పుడు దేశ భద్రతకు అవసరమైన సంస్థలను కూడా తరిమికొడతాననడం ఆయన సంకుచిత స్వభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో కియా, అమరరాజా వంటి దిగ్గజ సంస్థలను బెదిరించి పొరుగు రాష్ట్రాలకు పంపిన చరిత్ర జగన్దని, ఇప్పుడు గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు ఏపీకి వస్తుంటే మళ్లీ పెట్టుబడిదారులను భయపెట్టేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు ఆయనకు కేవలం 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వేట నిషేధ భృతి పెంపుతో పాటు జీవో 217 రద్దు వంటి నిర్ణయాలతో వారికి అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు.
తమిళనాడు మత్స్యకారుల బోట్ల విడుదల అంశంలో నారా లోకేశ్ జోక్యం ఉందంటూ జగన్ చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని కొల్లు రవీంద్ర కొట్టిపారేశారు. స్థానిక గ్రామస్థులు తమ మధ్య ఉన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని కోరడం వల్లే బోట్లను విడుదల చేశారని, ఇందులో రాజకీయ ప్రమేయం లేదని వివరించారు. నిజానికి గత ఐదేళ్ల జగన్ పాలనలో మెరైన్ గస్తీని గాలికొదిలేయడం వల్లే పొరుగు రాష్ట్రాల బోట్లు మన జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకెళ్లాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ చొరవతో స్పీడ్ బోట్లను ఏర్పాటు చేసి సముద్ర సరిహద్దులను పటిష్టం చేశామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు జగన్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తినైనా ప్రభుత్వం దీటుగా ఎదుర్కొంటుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.