AP Infrastructure Development: రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా పెట్టుబడులు, ఐటీ, ఉద్యోగాల కల్పనతో పాటు విద్య వైద్య రంగాలపై ఆయన కీలక ప్రకటనలు చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తూనే, భవిష్యత్తుపై భరోసా ఇచ్చేలా ప్రసంగించారు.
వైద్య రంగంలో పెను మార్పులు తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ప్రతి పౌరుడికి వర్తించేలా యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సుమారు రూ. 2.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా ఈ విధానాన్ని రూపొందించారు. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందించడమే కాకుండా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యంగా పీపీపీ విధానంపై వస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని, అవి ప్రభుత్వ ఆస్తులుగానే ఉంటాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయని స్పష్టం చేశారు. అలాగే, 'సంజీవని' ప్రాజెక్టు ద్వారా ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేస్తామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ గందరగోళంగా మారిందని సీఎం మండిపడ్డారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని చెబుతూనే, ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకునేలా యువతను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు పేరెంట్-టీచర్స్ మీటింగ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు భాషను కాపాడుకుంటూనే, ఆంగ్ల విద్యలో విద్యార్థులకు స్పష్టతనిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, 2019-24 మధ్య కాలంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల విధానాల వల్ల జాకీ, అమర్ రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోయాయని గుర్తు చేశారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో 913 కంపెనీలు మూతపడటం అత్యంత దురదృష్టకరమని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో మళ్లీ అనుకూల వాతావరణం సృష్టించి, పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా భారీగా ఉద్యోగాల కల్పన చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు.