తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడమే లక్ష్యం..
ఉత్తరాంధ్రప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష..
విజయవాడ: ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకమైన 11 ఇరిగేషన్ ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు రూ.2000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
మంగళవారం విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ 11 ప్రాజెక్టులు పూర్తయితే ఉత్తరాంధ్రలో సుమారు 2.69 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందని, మరో 2.49 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యమవుతుందని మంత్రి వివరించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రాంతాన్ని సాగులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కరువుప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
వంశధార ట్రిబ్యునల్ 2021 తీర్పును గెజిట్లో చేర్చడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఎంతో కీలకమని మంత్రి ప్రశంసించారు. ఢిల్లీకి పలుమార్లు వెళ్లి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చలు జరిపి ఒడిశాతో ఉన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా కృషి చేసినట్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ రావడంతో శ్రీకాకుళం జిల్లాలో నేరడి బ్యారేజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు.
గత ఐదేళ్లలో ఉత్తరాంధ్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని వైసీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు, అలాగే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను గత ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఉత్తరాంధ్ర సీఈ, ఎస్ఈలు, ఈఈలు, ఇతర అధికారులు, ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో సాగునీటి సౌకర్యాలు మెరుగుపడితే రైతుల జీవితాల్లో స్పష్టమైన మార్పు వస్తుందని, ఈ ప్రాజెక్టులు ఆ ప్రాంత అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు