హైబ్రిడ్ మహానాడుకు అపూర్వ స్పందన.. 7.5 లక్షల మంది పాల్గొనడం చరిత్ర..
మహిళలకు 33% రిజర్వేషన్ ప్రతిపాదనకు నేతల మద్దతు..
అమరావతి: తెలుగుదేశం పార్టీ మహానాడు తొలి రోజు కార్యక్రమాలకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించిందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మహానాడు తొలి రోజు నిర్వహణపై పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి ఇంచార్జులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్ల నుంచి సుమారు 7.5 లక్షల మంది కార్యకర్తలు, అభిమానులు వర్చువల్గా పాల్గొనడం ఒక చారిత్రాత్మక ఘట్టమని సీఎం పేర్కొన్నారు. ఈ స్థాయిలో కార్యకర్తల భాగస్వామ్యం పార్టీ బలాన్ని, ఐక్యతను ప్రతిబింబిస్తోందన్నారు. వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహణ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మహానాడు అనేది కేవలం పార్టీ సమావేశం కాదని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. మహానాడు వేదికగా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల ఐక్యతను చూసి ప్రత్యర్థి పార్టీలు ఆందోళన చెందుతున్నాయని వ్యాఖ్యానించారు.
మహానాడులో కార్యకర్తల ప్రసంగాలు విన్నప్పుడు సాధారణ కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదగాలనే తపనతో పనిచేస్తున్నారని అర్థమైందన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.
టెలికాన్ఫరెన్స్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చేసిన ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ఈ ప్రతిపాదనను ఆమోదించాలని పలువురు నాయకులు కోరారు. మహిళలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించే దిశగా ఈ నిర్ణయం కీలకమవుతుందని అభిప్రాయపడ్డారు. రేపటి మహానాడులో కీలక తీర్మానాలు, ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ కుటుంబ సభ్యులంతా చురుకుగా పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.