- "ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు": గత ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి తీవ్ర విమర్శలు..
- Politics: ఏపీలో సోలార్ విప్లవం: రాయితీ విద్యుత్ సరఫరాలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామన్న గొట్టిపాటి..
Prakasam Minister Gottipati Ravikumar: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని క్రిష్టంశెట్టిపల్లెలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన 'పీఎం సూర్యఘర్' (PM Surya Ghar) ఉచిత విద్యుత్ పథకాన్ని ఆయన అధికారికంగా ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని, ఇప్పటికే 6 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే వ్యవసాయ రంగానికి సోలార్ విద్యుత్ ద్వారా పగటిపూట 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచే ప్రసక్తే లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థపై చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవం రాష్ట్రానికి శ్రీరామరక్ష అని, వివిధ వర్గాల ప్రజలకు ఇప్పటికే రాయితీతో కూడిన విద్యుత్తును విజయవంతంగా అందిస్తున్నామని తెలిపారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ఐదేళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని ఆయన ధ్వజమెత్తారు.
అమరావతి రాజధాని విషయంలో పార్లమెంటులో జరిగిన పరిణామాలను మంత్రి ప్రస్తావిస్తూ, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు అమరావతి బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయని గుర్తు చేశారు. అయితే, దురదృష్టవశాత్తూ వైసీపీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ఇవ్వకుండా సభ నుంచి వాకౌట్ చేయడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే వారు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం వేగవంతం కావడంతో పాటు, విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని గొట్టిపాటి రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.