ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. చావో రేవో తేల్చుకోవాల్సిన కీలక మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ, నెట్ రన్ రేట్ సమీకరణాల్లో వెనుకబడటంతో పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ విజయంతో పని లేకుండానే, మెరుగైన రన్ రేట్ ఉన్న న్యూజిలాండ్ జట్టు సెమీ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. షాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ శ్రీలంక బౌలర్లను ఆడుకున్నారు. ముఖ్యంగా ఫర్హాన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదడంతో పాక్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా 176 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని జోడించారు. ఒక దశలో పాకిస్తాన్ 250 పరుగులు దాటుతుందనిపించింది. కానీ, ఫఖర్ జమాన్ అవుటైన తర్వాత లంక బౌలర్లు పుంజుకోవడంతో, పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.
పాకిస్తాన్ సెమీస్కు వెళ్లాలంటే శ్రీలంకను 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉంది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, యువ ఆటగాడు పవన్ రత్నాయకే అద్భుత పోరాటం చేశాడు. కేవలం 37 బంతుల్లోనే 58 పరుగులు చేసి పాకిస్తాన్ సెమీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. రత్నాయకే ఇన్నింగ్స్ వల్ల లంక స్కోరు 150 దాటడంతో, పాకిస్తాన్ గెలిచినా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుందని అప్పుడే తేలిపోయింది.
చివర్లో కెప్టెన్ దాసున్ శనక ఊచకోత కోశాడు. కేవలం 31 బంతుల్లో 8 సిక్సర్లతో 76 పరుగులు చేసి శ్రీలంకను దాదాపు గెలిపించినంత పని చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ పోరులో శ్రీలంక 20 ఓవర్లలో 207/6 పరుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ను దాటలేకపోయింది. ఫలితంగా ఇంగ్లండ్తో పాటు న్యూజిలాండ్ సెమీ ఫైనల్కు చేరుకుంది. పాకిస్తాన్ ఆటగాళ్లు బ్యాటింగ్లో రాణించినా, బౌలింగ్లో శ్రీలంకను త్వరగా ఆలౌట్ చేయలేకపోవడం ఆ జట్టు కొంపముంచింది. మరోవైపు ఈ టోర్నీలో శ్రీలంక ప్రయాణం కూడా ముగిసింది.