- గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా పొగాకు కంపెనీలో చెలరేగిన మంటలు..
- షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా..
Godfrey Phillips India: ప్రకాశం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టంగుటూరు మండలంలోని ప్రముఖ పొగాకు గ్రేడింగ్ సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా కంపెనీలో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
కంపెనీలోని పొగాకు గ్రేడింగ్ యూనిట్లో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే కంపెనీ యాజమాన్యం అగ్నిమాపక, పోలీస్ శాఖలకు తెలియజేసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇతర గిడ్డంగులకు మంటలు వ్యాపించకుండా నిరోధించగలిగారు.
విద్యుత్ సరఫరాలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 2,000కు పైగా పొగాకు బేళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దీంతో కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.