250కి పైగా ఉచ్చులు, కరెంట్ తీగలు తొలగించిన అటవీ సిబ్బంది..
వేటగాళ్లకు చెక్ పెట్టిన మారేడుమిల్లి ఫారెస్ట్ టీమ్..
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ సిబ్బంది చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. అడవుల్లో వేటగాళ్లు ఏర్పాటు చేసిన 250కి పైగా ఉచ్చులు, కరెంట్ తీగలను గుర్తించి తొలగించడం అభినందనీయమని పేర్కొన్నారు. అటవీ సంపదను, అడవి జంతువులను కాపాడేందుకు సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారని కొనియాడారు.
అడవుల్లో అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ వేటగాళ్లకు చెక్ పెడుతున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ తీగలతో అడవి జంతువులను వేటాడే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా అనేక వన్యప్రాణుల ప్రాణాలు కాపాడగలిగారని అన్నారు.
ఈ సందర్భంగా గిరిజనులకు కూడా పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అడవులు, వన్యప్రాణులు మన సంపద అని, వాటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అడవుల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
అటవీ సంపదకు హాని చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. అక్రమ వేట, అడవి నరికివేత, వన్యప్రాణులపై దాడులు వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. ప్రకృతి పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, అడవులు రక్షితంగా ఉంటేనే భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించగలమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.