స్కూటర్పై కార్యక్రమానికి వెళ్లి ప్రజలతో మమేకమైన సంధ్యారాణి..
ఖరీఫ్-2026కు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీ ప్రారంభం..
సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మరోసారి ప్రజల మధ్యకు వెళ్లి తన సరళమైన వ్యవహారశైలితో ఆకట్టుకున్నారు. “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా సాలూరు మెంటాడ వీధిలోని 1, 2 వార్డుల్లో కాలువలు, వీధుల పరిశుభ్రత పనులను ఆమె స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేయించి, ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ప్రభుత్వం చేపడుతున్న “ఇంజన్ పొదుపు” కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ మంత్రి సంధ్యారాణి ఈ కార్యక్రమానికి స్కూటర్పై వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజల మధ్య సాదాసీదాగా కలిసిపోయిన ఆమె, వీధి అరుగులపై మహిళలతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. దీంతో స్థానిక మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
అదే కార్యక్రమంలో ఖరీఫ్-2026 సీజన్కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాల పంపిణీని మంత్రి ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సకాలంలో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 22,348 క్వింటాళ్ల వరి విత్తనాలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా 8,883 క్వింటాళ్ల వరి విత్తనాలను గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 50 శాతం రాయితీతో పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
రైతులకు అవసరమైన పరికరాలను అందించేందుకు ఐటిడిఏ ఆధ్వర్యంలో 802 టార్పాలిన్లు, 14 ఆయిల్ ఇంజన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో పాటు తేమ నిల్వ ఉండి రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
సాలూరు నియోజకవర్గ రైతులకు 8,100 PMDS కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు అవసరమైన సహాయం అందిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సంధ్యారాణి స్పష్టం చేశారు. పరిశుభ్రత నుంచి వ్యవసాయం వరకు ప్రజలతో మమేకమై మంత్రి సంధ్యారాణి నిర్వహించిన ఈ కార్యక్రమాలు స్థానికంగా మంచి స్పందన పొందాయి.